జగన్ మరో కీలక నిర్ణయం.. గ్రేట్ ప్లాన్.. అదే జరిగితే ఏపీకి మహర్దశే..
ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'నాడు-నేడు' కార్యక్రమాన్ని చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో 'నాడు-నేడు' కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీల్లోనూ అమలుచేయాలని తాజాగా జగన్ నిర్ణయించారు.దాదాపు 24 వేల అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి.. భవనాలు,మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీల్లో గర్భణి స్త్రీలు,పిల్లలకు ఇచ్చే ఆహారం విషయంలోనూ ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాలు,సూచనలు చేశారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడవద్దన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్షా సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
మొదట 9 రకాల సదుపాయాలు..
నాడు-నేడు కార్యక్రమం కింద తొలి దశలో 15,715 స్కూళ్ల రూపు రేఖలను మారుస్తున్నారు. ఇందుకోసం మొదట 9 రకాల సదుపాయాలను కల్పిస్తున్నారు. అదే తరహాలో అంగన్వాడీల్లోనూ మొదట 9 రకాల సదుపాయాలను కల్పించాలని జగన్ అధికారులకు సూచించారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీల్లో పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలన్నారు. అలాగే అవసరమైన ఫర్నీచర్,ఫ్యాన్స్,ట్యూబులైట్స్,ఫ్రిజ్,శుభ్రమైన తాగునీరు,మరుగుదొడ్లు,బ్లాక్ బోర్డులు అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు.
ప్రీ స్కూల్ తరహాలో అంగన్వాడీలను తీర్చిదిద్దే ప్లాన్..
అంగన్వాడీ స్కూళ్లన్నీ ప్రీ స్కూల్ తరహా విధానంలోకి రావాలని,పక్కా భవనాలు లేని అంగన్వాడీ కేంద్రాలకు అంచనా వ్యయాలను రూపొందించాలని జగన్ ఆదేశించారు. పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించేందకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వం హయాంలో తల్లులు, పిల్లలకు పౌష్టికాహారంపై కేవలం రూ.740 కోట్లు ఖర్చు చేస్తే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-2020లో రూ.1100 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ ఏడాదిలోనే దాన్ని రూ.1862కోట్లకు పెంచే ఆలోచనలో ఉన్నామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మార్చే నాడు-నేడు..
ప్రభుత్వ స్కూళ్లను రూపు రేఖలను మార్చివేసేందుకు ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమాన్ని చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి దశలో 15,715 స్కూళ్ల మార్పులో భాగంగా 9 రకాల సదుపాయాలు కల్పించబోతున్నారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా 1 నుంచి 3వ తరగతి వరకు 1.50 లక్షల బల్లలు, 4 నుంచి 6వ తరగతి వరకు మరో 1.50 లక్షల బల్లలు, 7 నుంచి 10వ తరగతి వరకు డ్యుయల్ డ్రాలతో కూడిన 2.10 లక్షల బల్లలు కొనుగోలు చేయబోతున్నారు. అలాగే టీచర్ల కోసం 89,340 కుర్చీలు, టేబుళ్లు, 72,596 గ్రీన్ చాక్ బోర్డులు, 16,334 అల్మారాలు, 1,57,150 ఫ్యాన్లు కొనుగోలు చేయబోతున్నారు. ఇదే స్ఫూర్తితో ఇప్పుడు అంగన్వాడీలను కూడా ప్రీ స్కూళ్లలా తీర్చిదిద్దబోతున్నారు.
అదే జరిగితే ఏపీకి మహర్దశే..
నిజానికి చాలాచోట్ల ఇప్పుడు ప్లే స్కూళ్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. స్కూల్ కంటే ముందు ప్రీ స్కూలింగ్ తరహాలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్లే స్కూళ్లకు పంపిస్తున్నారు. అయితే కాస్త డబ్బున్నవాళ్లు మాత్రమే ప్లే స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించగలరు. పేద,దిగువ మధ్య తరగతి కుటుంబాలు తమ పిల్లలను ఎక్కువగా అంగన్వాడీ కేంద్రాలకే పంపిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్లే స్కూళ్లకు ధీటుగా ప్రీ స్కూలింగ్ తరహాలో అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దాలని జగన్ యోచిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలతో రాష్ట్రంలోని పేద,మధ్య తరగతి వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో వారు అనేక అవకాశాలను అందిపుచ్చుకోగలరు.