జగన్! నిన్ను ఎన్నిసార్లు తన్నారు, ఆ విషయాలు తెలియొద్దనే: దులిపిన టిడిపి
విశాఖలో జరిగిన వైసిపి అధినేత వైయస్ జగన్ సభలో.. ఆయన సమక్షంలోనే ఖాదర్ బాషా అనే వ్యక్తి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో జరిగిన భూకబ్జాలను బట్టబయలు చేశారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు
విశాఖ: విశాఖలో జరిగిన వైసిపి అధినేత వైయస్ జగన్ సభలో.. ఆయన సమక్షంలోనే ఖాదర్ బాషా అనే వ్యక్తి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో జరిగిన భూకబ్జాలను బట్టబయలు చేశారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు.
చదవండి: చంద్రబాబుపై సంచలనం: జగన్కు దిమ్మతిరిగే షాకిచ్చిన సాధారణ వ్యక్తి
మంత్రి నారా లోకేష్పై బురద జల్లే ప్రయత్నంలో జగన్ తన పైనే బురద వేయించుకున్నారని గురువారం ఎద్దేవా చేశారు.
గాజువాక నియోజకవర్గం వెంకన్నపాలెం గ్రామంలో ఖాదర్ బాషాకు ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో కేటాయించిన భూమి వైయస్ హయాంలోనే కబ్జాకు గురైందంటూ జగన్ సాక్షిగా సభలోనే బాషా వెల్లడించారన్నారు.
ఆర్థిక ఉగ్రవాది.. ఆ స్కాంలోనూ జగన్ పాత్ర అంటూ..
ఆర్థిక ఉగ్రవాది అయిన జగన్ పక్కన కూర్చుని సిపిఐ, సిపిఎం తమ విలువలు తగ్గించుకున్నాయని కళా వెంకట్రావు నిప్పులు చెరిగారు. విశాఖలో స్వాతంత్య్ర సమరయోధుల భూమి స్కాంలో జగన్ పాత్ర ఉందని సిఐడి తేల్చిందని, అటువంటి వ్యక్తి పక్కన కూర్చుని ఈ పార్టీలు భూకబ్జాలను అరికడదామనడం విడ్డూరంగా ఉందన్నారు.
సభతో జగన్ తండ్రి కబ్జాలు వెల్లడించాడు
చంద్రబాబు ప్రభుత్వంపై బురద చల్లాలని విశాఖలో సమావేశం పెట్టి, జగన్ తన తండ్రి చేసిన భూకబ్జాలను లోకానికి వెల్లడించారన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో విశాఖలో ఎన్నో కబ్జాలు జరిగాయని సిట్ కూడా వేయలేదని కళా వెంకట్రావు గుర్తు చేశారు. విశాఖలో అక్రమాలు అని చెబుతున్న వైసిపిసిట్కు ఎందుకు ఆధారాలు చూపలేకపోతుందో చెప్పాలన్నారు.
జగన్ బాగోతం ప్రజలకు తెలుసు
దేశంలోనే సుందరనగరంగా పేరుగాంచిన విశాఖపట్నం బ్రాండ్ ఇమేజిని ప్రతిపక్ష వైసిపి దెబ్బతీస్తోందని మరో మంత్రి నక్కా ఆనంద్ బాబు తండ్రి అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి చిత్తూరు వరకు, ఇచ్ఛాపురం నుంచి తడ వరకు భూ కబ్జాలకు, సూట్ కేస్ కంపెనీలకు తెరతీసిన జగన్ బాగోతం ప్రజలకు తెలుసన్నారు. విశాఖ భూముల స్కాంను వెలికితీసి సిట్తో పాటు బహిరంగ విచారణకు ఆదేశించింది తమ ప్రభుత్వమైతే దొంగే దొంగ అన్నట్లుగా జగన్ ధర్నా నిర్వహించటం సిగ్గుచేటు అన్నారు.
విశాఖలో చిచ్చుకు జగన్ కుట్ర
రాష్ట్రం మొత్తంలో పచ్చని నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో చిచ్చురేపేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారని నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. హుధుద్ తుపానుతో శ్మశాన వాటికను తలపించిన విశాఖను రెండేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా శ్రద్ధ తీసుకుని అభివృద్ధిలోకి తీసుకు వచ్చారన్నారు. జగన్ నిజస్వరూపం ప్రజలకు తెలుసని, ఆయన అధికారంలోకి రావటం కలే అన్నారు.
జైలుకెప్పడెళ్తావో తెలియదు.. చెప్పుతో కొడతారు
నీ చరిత్ర ప్రజలు చూశారని, నీ తండ్రి అధికారం అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా సంపాదించి రిమాండ్లో ఉన్నావని, బెయిల్ మీద తిరుగుతున్నావని, మళ్లీ జైలుకు ఎప్పుడెళతావో తేలీదని, అలాంటి నువ్వు లోకేష్ గురించి మాట్లాడుతావా అని ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. రాజధానికి అడ్డుపడి రైతుల్ని రెచ్చకొట్టి, తునిలో అల్లర్లు సృష్టించిన నేర చరిత్ర కలిగిన జగన్ ఇదే రకంగా వ్యవహరిస్తే ప్రజలు చెప్పుతో కొట్టే రోజు వస్తుందన్నారు.
జిమ్మిక్కులు.. కిరాయి మనుషులు..
రాష్ట్రాన్ని దోచుకొని 11 కేసుల్లో ఎ1, ఎ2 నిందితులుగా ఉన్న వాళ్లు ప్రజలకు మేలు చేస్తారా, వైసిపి జిమ్మిక్కులను విశాఖ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. కిరాయి మనుషులను తరలిస్తూ మహాధర్నా పేరుతో జగన్ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే వైసిపి విశాఖలో ధర్నా చేపట్టిందన్నారు. విశాఖ భూ ఆక్రమణలపై సమగ్రంగా విచారణ జరిపి, సూత్రధారులను ఆధారాలతో పట్టుకోవాలనే సిట్ని ఏర్పాటు చేశామన్నారు.
ఆ విషయాలు తెలియవద్దనే ధర్నా
ధర్నాల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని, ప్రజలకు మేలు చేయాలనుకుంటే భూ ఆక్రమణలకు సంబంధించి ఆధారాలను సిట్కి అందజేయాలని కేఈ సూచించారు. సిట్ విచారణ పూర్తయితే వైసిపి ఆరోపణలు అబద్దమని తేలతాయనే ఉద్దేశంతో ప్రజలకు నిజాలు తెలియకూడదని జగన్ విచారణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 2004 నుంచి జరిగిన భూ కబ్జాలపై విచారణ జరుగుతుందని, నిందితుల విషయంలో కఠినంగా వ్యవహరించి, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నానన్నారు.
జగన్! నిన్ను ఎన్నిసార్లు తన్నారు
విశాఖ భూకుంభకోణంపై సిబిఐతో విచారణ జరిపిస్తే సీఎం చంద్రబాబును, మంత్రి లోకేష్ను తన్ని తంతారన్న జగన్ వ్యాఖ్యలకు మంత్రి దేవినేని కౌంటర్ ఇచ్చారు. 12 సిబిఐ చార్జిషీట్లు ఉన్న జగన్ను ఎన్నిసార్లు తన్ని తగలేశారని ప్రశ్నించారు. 12చార్జిషీట్లలో ఏ1 ముద్దాయిగా ఉన్న జగన్ తమపై సీబీఐ కేసును అడుగుతారా అని మండిపడ్డారు. జగన్ మాట్లాడిందే నిజమైతే ఆయన 12 సీబీఐ కేసుల్లో తన్నులు తిన్నారా? అని ప్రశ్నించారు. 12 సీబీఐ కేసుల్లో తన్నులు తిని 16 నెలలు జైల్లో ఉండి తమనెందుకు ఆడిపోసుకుంటున్నారన్నారు. చంద్రబాబు, లోకేశ్ల పేర్లు ఎత్తే నైతిక అర్హత జగన్కు లేదన్నారు.