సింగపూర్, జపాన్ కాకపోతే అమెరికా.. కానీ: జగన్
తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. శుక్రవారం రాజమండ్రిలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజధాని పేరుతో ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం అన్యాయమని అన్నారు.
ప్రభుత్వ భూమి ఉంటే సింగపూర్ కాకపోతే జపాన్.. అది కాకుండా అమెరికా లాంటిది కట్టుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మూడు పంటలు పండే భూమిని రైతుల నుంచి బలవంతంగా లాక్కోవడం బుద్ధి ఉన్న వారెవరూ హర్షించరని వైయస్ జగన్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కావాలంటే మంగళగిరిలో 2, 3 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అక్కడే రాజధాని నిర్మించుకోవచ్చని అన్నారు. మూడు పంటల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకోవడం అన్యాయమని అన్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రైతుల జీవితాలతో చెలగాటాలాడుకోవడం సరికాదని అన్నారు. తాము బాధ్యతయుతమైన ప్రతిపక్ష హోదాలో ఉన్నామని.. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని జగన్మోహన్ రెడ్డి అన్నారు.
పంటభూముల్లో రాజధాని బుద్ధి తక్కువ పనే: రాఘవులు
పంటభూముల్లో రాజధాని నిర్మాణం బుద్ధి తక్కువ పని అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు సిపిఎం నేత బివి రాఘవులు. మంగళగిరి సమీపంలో భారీగా ప్రభుత్వ భూములున్నా.. వాటిని వదిలేసి చంద్రబాబు సర్కారు తూళ్లూరు రాజధానిగా ఎంచుకుని రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తోందని రాఘవులు ఆరోపించారు.
ఏపి రాజధాని నిర్మాణం కోసం సేకరిస్తున్న భూములపై ఏపి సిఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై సిపిఎం నేత బివి రాఘవులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వామపక్షాలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను చంద్రబాబు తక్షణమే ఉపసంహరించుకోవాలని అన్నారు.
రాజధాని కోసం వెయ్యి ఎకరాలు చాలంటున్న వామపక్షాలు, తమ పార్టీ కార్యాలయం కోసం 10 ఎకరాల మేర భూములు అడుగుతున్నాయని చంద్రబాబు గురువారం మాట్లాడుతూ ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై రాఘవులు శుక్రవారం స్పందించారు.