సెటైర్లు, విమర్శల వర్షం: చంద్రబాబును ఓ ఆట ఆడేసిన జగన్, మామూలుగా కాదు!
పశ్చిమగోదావరి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో మంగళవారం ప్రసంగించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. బ్రిటీష్ వాళ్ల వెన్నులో వణుకుపుట్టించిందే తణుకు అని వ్యాఖ్యానించారు. తణుకులో టీడీపీ ఎమ్మెల్యే అరాచకాలకు హద్దే లేకుండా పోయిందని అన్నారు. గోదావరిలో ఇసుక మాఫియాలో రెచ్చిపోతోందని అన్నారు.
చంద్రబాబు ఢిల్లీలో రహస్యంగా..
‘చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి చేసిందేమిటంటే.. అగ్రిగోల్డ్ కంపెనీని కొనుగోలు చేసేందుకు వచ్చిన ఎస్సెల్ గ్రూప్ కంపెనీతో 3గంటలపాటు రహస్యంగా మాట్లాడారు. మీడియాలో ఈ విషయం రాకుండా చర్యలు చేపట్టారు. ఇలాంటి చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం ఎలా చేస్తారు? 4500కోట్లలో 2వేల కోట్లకే ఇస్తారట, ఆస్తులు కాజేసే కుట్ర చేస్తున్నారు. 1100కోట్లను బాధితులకు కేటాయిస్తే 80శాతం బాధితులకు సాయం అందుతుంది. మా ప్రభుత్వం వచ్చాక బాధితులందరికీ న్యాయం చేస్తాం. ఆస్తులు అమ్మేయాలని చూసిన ఈ పాలకులను ఏ బొక్కలో పెట్టాలని ఆలోచిస్తాం' అని జగన్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు నీతిమంతుడే కానీ..
‘విజయనగరంలోని శృంగవరపుకోటలో చంద్రబాబు మాట్లాడుతూ.. తన వేలికి ఉంగరం లేదు. గడియారం లేదు. మెడలో గొలుసు కూడా లేదని చెప్పుకున్నారు. కాని, 2ఎకరాల నుంచి 4లక్షల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారు?'అని జగన్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా తనకు ఒక వ్యక్తి చంద్రబాబుపై కథను రాసిచ్చాడని చెప్పిన జగన్ ఆ కథను చదివి వినిపించారు. తాను నీతిమంతుడు అని చెప్పుకునే చంద్రబాబు 2 ఎకరాల నుంచి 4లక్షల కోట్లు ఎలా సంపాదించారని జగన్ నిలదీశారు. హైదరాబాద్లో బ్రహ్మాండమైన భవనం ఎలా కడుతున్నారని అన్నారు.
నోట్ల రద్దుకు ముందే హేరిటేజ్ షేర్లు..
‘వేల కోట్ల హేరిటేజ్ కంపెనీ షేర్లు అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.150 నుంచి రూ. 990కి ఎలా పెరిగాయి. పెరిగిన షేర్లను మరో గ్రూప్ కు ఎలా అమ్మేశారు. నోట్ల రద్దుకు రెండ్రోజుల ముందే ఇది జరగడం ఏంటి? నోట్ల రద్దు చంద్రబాబుకు ముందు తెలుసా?' అని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు.
బాబుకు మందు అలవాటు లేదండీ..
‘తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి చంద్రబాబుకు నల్లధనం ఉంటుంది. ఆ ధనంతో ఆడియో, వీడియో టేపుల్లో దొరికాడు. ఏపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనుగోలు చేస్తాడు. బాబుకు మందు అలవాటు లేదండి.. కానీ, రాష్ట్రంలో ప్రతి ఊర్లో మద్యం, బెల్టుషాపులు పెట్టిస్తాడు. సాయంత్రం పెగ్గువేయాలని సలహా కూడా ఇస్తాడు. ఖర్చుల కోసం తాను కూడా పేకాట ఆడానని చెబుతారు' అంటూ బాబుపై జగన్ మండిపడ్డారు.
చంద్రబాబు ఏ అమ్మాయినీ చూడరండీ..
‘చంద్రబాబుకైతే ఏ అమ్మాయిని చూసే అలవాటు లేదండీ.. రాష్ట్రంలో అమ్మాయిలపై జరిగే అత్యాచారాలు, హత్యలను పట్టించుకోరండి. బాబుకు ధైర్యం ఎక్కువండీ.. కానీ, తనపై వచ్చిన ఆరోపణలుకు మాత్రం విచారణ ఎదుర్కోరండి. అంతకుముందే బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తారు. సొంత ప్రయోజనాల కోసం హోదా తాకట్టు పెట్టారు. ఎంపీలతో మాత్రం రాజీనామా చేయించరు' అంటూ చంద్రబాబుపై జగన్ ధ్వజమెత్తారు.
బాబు ఎవరికీ అన్యాయం చేయరండీ..
‘చంద్రబాబుకు ఎవరికీ అన్యాయం చేయరండీ.. కానీ, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ చేయరు. నిరుద్యోగ భృతి ఇవ్వరు. పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వరు. పార్టీ ఎమ్మెల్యేలకు బాబు దోపిడీలో ట్రైనింగ్ ఇస్తారండి' అంటూ చంద్రబాబుపై జగన్ సెటైర్లు వేశారు.
చంద్రబాబు 40ఏళ్ల ఇండస్ట్రీ కదండీ..
‘చంద్రబాబు నీతి కథలు, మాటలు చెబుతారండీ.. ఆయన మాత్రం పంచభూతాలను మింగేస్తారండీ.. ఇసుక మాఫీ, రాజధాని, బడి, గుడి భూములు కాజేస్తారండీ.. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు, లంచాలు తీసుకుంటారండీ.. ఎయిర్ఏషియా స్కాంలో చంద్రబాబు చేతివాటం ఉందటండి.. 40ఏళ్ల అనుభవం, ఇండస్ట్రీ కదండి..' అంటూ జగన్ ఎద్దేవా చేశారు.
ఫోన్, కంప్యూటర్ బాబే కనిపెట్టారు.. కానీ కొడుకునే పప్పు..
‘చంద్రబాబు గారే సెల్ఫోన్, కంప్యూటర్, సాఫ్ట్వేర్ కనిపెట్టారండి. సత్యనాదెళ్లకు సాఫ్ట్వేర్లో, పీవీ సింధుకు బ్యాడ్మింటన్లో ట్రైనింగ్ ఇచ్చింది చంద్రబాబే. ఆయన కొడుకు లోకేష్కు మాత్రం ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వలేదు. ఆయనకు ప్రజలు పప్పు అనే బిరుదు కూడా ఇచ్చారండి. చంద్రబాబు చెప్పేవి నీతులు.. చేసేవీ తప్పులు' అంటూ జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాబును క్షుణ్ణంగా గమనించిన ఆ వ్యక్తి ఈ మేరకు కథ రాశారని చెప్పారు.
చంద్రబాబు పెద్ద అబద్ధాలతో..
వచ్చే ఎన్నికల కోసం చంద్రబాబు మళ్లీ వస్తారనని.. క్షమించవద్దని అన్నారు. 98శాతం హామీలు అమలు చేశానంటూ చంద్రబాబు పెద్ద అబద్ధంతో ప్రచారం మొదలుపెడతారని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు.. ప్రతీ ఇంటికీ కిలో బంగారం, ఓ బెంజి కారు కూడా ఇస్తామంటారని అన్నారు. అంతేగాక, చంద్రబాబు ఓ మనిషిని ప్రతీ ఇంటికి పంపి రూ.3వేలు ఇస్తారని.. అయితే 5వేలు ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేయాలని కోరారు. ఆ డబ్బు ప్రజలదేనని అందుకే తీసుకోవాలని.. ఓటు మాత్రం మనస్సాక్షి ప్రకారం వేయాలని జగన్ పిలుపునిచ్చారు.
అలాంటి పరిస్థితి రానివ్వను..
చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని అన్నారు. తమ ప్రభుత్వం వస్తే పూర్తి పీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి పేదలు చదువుకునేలా చేస్తామని జగన్ చెప్పారు. నెల్లూరులో ఓ విద్యార్థి తనకు ఫీజు రీఎంబర్స్ పూర్తిస్థాయిలో అందక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఇలాంటి పరిస్థితి తమ ప్రభుత్వ హాయాంలో రాదని అన్నారు. అందరూ చదువుకునేలా చేస్తామని అన్నారు. చంద్రబాబుది మానవత్వం లేని ప్రభుత్వమని దుయ్యబట్టారు.