ఆరో పెళ్లికి సిద్ధమయ్యారు, బాదుడంతా లోకేష్ కోసమే..: బాబుపై జగన్ నిప్పులు
విశాఖపట్నం: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉండటం ప్రజల ఖర్మ అని, ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా ఆయన రంగులు మారుస్తారని జగన్ ధ్వజమెత్తారు.
విశాఖపట్నం జిల్లాలో 241వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ కోటవురట్ల బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారని అన్నారు. జిల్లాలోని మూడు షుగర్ ఫ్యాక్టరీలను మూసేశారని, తాండవ, ఏటికొప్పాక, చోడవరం షుగర్ ఫ్యాక్టరీలు నష్టాల్లో ఉన్నాయని అన్నారు. చెరకు రైతులు చంద్రబాబు పాలనలో నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు.
20కోట్లు దోచుకున్నారు..
విశాఖ తర్వాత అధిక భూ అక్రమాలు పాయకరావుపేటలోనే జరిగాయని వైయస్ జగన్ ఆరోపించారు. వరాహ, తాండవ నదుల్లో ఇసుకను దోచేస్తున్నారని మండిపడ్డారు. నీరు-చెట్టు కింద రూ.20కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. పాయకరావు నియోజకవర్గంలో బాబు హయాంలో ఐదు ఇళ్లు కూడా కట్టించలేదని అన్నారు. నక్కపల్లి ఆస్పత్రిలో కనీసం ఐదుగురు డాక్టర్లు లేరు, మందులు కూడా లేవని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలో ఒక్కటైనా నెరవేర్చారా? అని జగన్ ధ్వజమెత్తారు.
ఐదు పెళ్లిళ్లు చేసుకుని..
సీఎం చంద్రబాబు ఐదు పార్టీలను పెళ్లి చేసుకుని వదిలేశారని.. తాజాగా కాంగ్రెస్తో పెళ్లికి సిద్ధమయ్యారని జగన్ ఎద్దేవా చేశారు. గతంలో ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు.. కాంగ్రెస్ను బాయ్కాట్ చేయాలన్నారని జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేశారని ధ్వజమెత్తారు. రాహుల్తో రాయబారం కోసం కుటుంబసభ్యులను పంపారని అన్నారు.
ఇప్పుడు కాంగ్రెస్తో పెళ్లి.. లోకేష్ ప్యాకెట్ మనీ కోసం..
‘ఇప్పటికే బీజేపీతో పెళ్లి చేసుకున్నారు.. వదిలేశారు. టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ఆఖరికి జనసేనను కూడా పెళ్లి చేసుకుని వదిలేశారు. ఇప్పుడు కాంగ్రెస్ను కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. బాబు పాలనకు బ్రిటీష్ పాలనకు తేడా ఏమీ లేదు. స్కూళ్లు, కాలేజీ, ఫీజులు బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ వ్యాట్లు బాదుడే బాదుడు.. లోకేష్ ప్యాకెట్ మనీ కోసం ఛార్జీల బాదుడు. పల్నాడు నుంచి ప్రకాశం జిల్లా వరకు ఛార్జీల పేరిట దోపిడీ చేస్తున్నారు' అని జగన్ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
అక్రమ మైనింగ్ డాన్
చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అక్రమ మైనింగ్కు డాన్ అని జగన్ ఆరోపించారు. విశాఖలో సమ్మిట్లు పెట్టి రూ.20లక్షల కోట్ల పెట్టుబడులు, 40లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు.. తీరా చూస్తే ఎవరికీ ఉద్యోగాలు వచ్చిన దాఖలు లేవని జగన్ వ్యాఖ్యానించారు. అమరావతి బాండ్లకు రూ.2వేల కోట్లు వచ్చాయని బాబు అనుకూల మీడియా ఆహా.. ఓహో.. అంటూ పొగుడుతున్నాయని జగన్ ఎద్దేవా చేశారు. 8.9శాతానికి బాండ్లు తీసుకొచ్చారని.. పక్క రాష్ట్రాలు తక్కువ వడ్డీకి బాండ్లు తీసుకొస్తే.. చంద్రబాబు మాత్రం 10.32 శాతానికి బాండ్లు తెచ్చారని అన్నారు. వీటిలో కూడా కొంత ఆయన జేబులోకి వెళ్తోందని, ఈయన పాలనలో లంచాలు లేనిదే ఏ పని జరగదని జగన్ ఆరోపించారు. రాజధానిలో ఇప్పటి వరకు ఒక్క పర్మినెంట్ ఇటుక కూడా పడలేదని, ఏం చేసినా తాత్కాలికమేనని అన్నారు. తాత్కాలిక సెక్రటేరియట్ అడుగుకు రూ.10వేలు ఇచ్చారు.. బయట 3సెంటిమీటర్ల వర్షం పడితే.. సెక్రటేరియట్లో 6సెంటిమీటర్ల వర్షం లీక్ అవుతోందని, ఆయన నాలుగున్నరేళ్ల పాలనలో అంతా అబద్ధాలు, మోసాలు.. అవినీతే ఉన్నాయని జగన్ ధ్వజమెత్తారు.
అధికారంలోకి వస్తే సీపీసీ రద్దు.. రైతుకు పెట్టుబడి
తాము అధికారంలోకి వస్తే వారం రోజుల్లోగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దు చేస్తామని జగన్ చెప్పారు. అధికారంలోకి రాగానే చేసే తొలిపని ఇదేనని జగన్ అనే నేను హామీ ఇస్తున్నాను అని చెప్పారు. రైతన్నకు పెట్టుబడి తగ్గించగలిగితే ఆదాయం పెరుగుతుందన్నారు. రైతులకు పగటి పూటే 9గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. కాప్ లోన్లు తీసుకుంటే వడ్డీ భారం లేకుండా చేస్తామని అన్నారు. పెట్టుబడి సాయం కింద ఏటా మే నెలలో రూ.12,500 చెల్లిస్తామని జగన్ చెప్పారు. ఎన్నికల సమయంలో మనస్సాక్షి ప్రకారం ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు వైయస్ జగన్.