సంస్థలో బాబుకూ భాగం, నారాయణని జైల్లో పెట్టండి: ప్రేమ కోణంపై జగన్ ఆగ్రహం
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు తీవ్ర ఆరోపణలు చేశారు. నారాయణ కాలేజీలో చంద్రబాబుకు భాగం ఉంది కాబట్టే ఆయన ఈ కళాశాలల్లోని ఆత్మహత్యలపై మాట్లాడటం లేదన్నారు.
కడప నగర శివారు కృష్ణాపురం వద్ద ఉన్న నారాయణ కళాశాల హాస్టల్లో సోమవారం సాయంత్రం ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. జగన్ విద్యార్థినుల తల్లిదండ్రులను మంగళవారం నాడు ఉదయం పరామర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ సంఘటన పైన ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన అవసరం ఉందని, అందుకు బుధవారం నాడు కడప టౌన్ బందుకు పిలుపునిస్తున్నట్లు జగన్ ప్రకటించారు. దీనికి అందరు సహకరించాలని ఆయన కోరారు.
చంద్రబాబు సోమవారం నాడు సాయంత్రం ఆరున్నర వరకు కడప జిల్లాలోనే ఉన్నారని, నాలుగున్నర గంటలకే ఈ సంఘటన జరిగిందన్నారు. ఒక్క నారాయణ కాలేజీలోనే పదకొండు మంది చనిపోతే చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలన్నారు.
పిల్లలు చనిపోతుంటే ఓ ముఖ్యమంత్రి స్పందించకపోవడం, నోరు మెదపకపోవడం విడ్డూరమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక నారాయణ కాలేజీలల్లో 11మంది మృతి చెందారన్నారు. వేరే కళాశాలల్లో జరిగితే ఇలాగే మౌనంగా ఉంటారా అని ప్రశ్నించారు.
బాబుకు ఇందులో భాగం ఉంది కాబట్టే మౌనంగా ఉందన్నారు. తిరుపతి, అనంతపురం, ఎస్పీఎస్ నెల్లూరు, కృష్ణా, కడప, కర్నూలు జిల్లాల్లోని నారాయణ కాలేజీల్లో విద్యార్థులు చనిపోయారన్నారు. చనిపోయారని చెబితే కొత్తగా ప్రేమ వ్యవహారం తెరపైకి తెస్తున్నారని జగన్ మండిపడ్డారు.
పదో తరగతి పాసై మూణ్ణెళ్లు కాలేదని, చనిపోవడానికి లవ్ అంటూ లెటర్ సృష్టిస్తున్నారన్నారు. ఇలా చెప్పేందుకు బుద్ది ఉందా అన్నారు. వాళ్లు రాయని లెటర్లు సృష్టిస్తున్నారన్నారు.
పదో తరగతి చదివి అప్పుడే ఇంటర్లో జాయిన్ అయిన అమ్మాయిలపై అభాండాలు వేయడం సరికాదన్నారు. ఆత్మహత్య అంటూ కొత్త కొత్త లేఖలు వస్తున్నాయన్నారు. ఉరి వేసుకోక ముందు చనిపోయారా లేక ఆ తర్వాత చనిపోయారా అంటే డాక్టర్ నుంచి సమాధానం లేదని, పోస్టుమార్టం ఎంత దారుణంగా జరిగిందో ఇది ఉదాహరణ అన్నారు.
ప్రాణాలు కోల్పోవడం ఓ దారుణం అయితే, అభాండాలు వేయడం మరో దారుణమని విద్యార్థులు చెబుతున్నారన్నారు. ప్రేమ కోణం ఉందని చెప్పడం సరికాదన్నారు. కాలేజీలకు, యూనివర్సిటీలకు పిల్లల్ని పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారన్నారు.
రిషికేశ్వరి కేసులో ఇప్పటి వరకు దోషిని అరెస్టు చేయలేదన్నారు. పీ నారాయణ ఇంకా మంత్రివర్గంలో ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. నారాయణ కాలేజీల పైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నారు. స్కూళ్లను మూసివేసి ఎనిమిది కిలోమీటర్లకు ఓ స్కూల్ పెట్టే పరిస్థితి చంద్రబాబు తెస్తున్నారన్నారు.
నారాయణ కాలేజీ, స్కూళ్లను ప్రతి ఊళ్లో పెట్టాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తాను వస్తున్నానని మృతదేహాలను తరలించే ప్రయత్నం చేస్తే తల్లిదండ్రులు అడ్డుకున్నారన్నారు. రీపోస్టుమార్టం హైదరాబాదులో చేయాలని, నారాయణ కళాశాల పైన చర్యలు తీసుకోవాలన్నారు. నారాయణను మంత్రివర్గం నుంచి తొలగించాలన్నారు. నారాయణ సంస్థను మూసేసి, ఆయనను జైల్లో పెట్టాలన్నారు.