ప్రభుత్వంపై అవిశ్వాసానికి జగన్ నిర్ణయం, స్పీకర్పై ఆ తర్వాతే..
హైదరాబాద్: విజయవాడలోని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఓ ఆసక్తికర సన్నవేశం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజరవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్రాజు ఆ పార్టీకి షాక్ ఇచ్చి ఆదివారం టీడీపీలోకి చేరారు.
ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా నుంచి ఆదివారం ఉదయానికే విజయవాడ చేరుకున్న ఆయన నేరుగా చంద్రబాబు వద్దకు వెళ్లారు. చంద్రబాబును చూడగానే డేవిడ్ రాజు కిందకు వంగి చంద్రబాబు పాదాలకు అభివాదం చేశారు. అనంతరం డేవిడ్ రాజును పైకి లేపిన చంద్రబాబు కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి శిద్ధా రాఘవరావులు డేవిడ్రాజును చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అక్కడున్న వారంతా చంద్రబాబుకు డేవిడ్ రాజు పాదాభివందనం చేసిన దృశ్యాన్ని చూసి అవాక్కయ్యారు. చంద్రబాబుకు పాదాభివందనం చేసి మొదట్లోనే మంచి మార్కులు కొట్టేశాడనే టీడీపీ నేతలు అంటున్నారు.
అనంతరం బయటకు వచ్చి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరినట్టు డేవిడ్ రాజు తెలిపారు. యర్రగొండపాలెం అభివృద్ధికి సీఎం చంద్రబాబు హామీయిచ్చారని చెప్పారు. గత ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో వైసీపీలో చేరినట్టు తెలిపారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని విపక్షం సవాల్ విసరడంపై స్పందిస్తూ... ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. రాజీనామా అవసరం లేదని అనుకుంటున్నట్లు చెప్పారు. అంతకుముందు టీడీపీలో 24 ఏళ్ల పాటు పనిచేశానని గుర్తుచేశారు. రాజకీయాలను ఎన్నికల వరకే పరిమితం చేయాలని అన్నారు.
డేవిడ్ రాజు పార్టీ ఫిరాయించడంపై యర్రగొండపాలెంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్వలాభం కోసమే పార్టీ మారారని ఆరోపించారు. డేవిడ్ రాజు ఫ్లెక్సీలను చించివేసి నిరసన తెలిపారు.
ఇదిలా ఉంటే ఒకవైపు క్రమంగా చేజారిపోతున్న ఎమ్మెల్యేలు, మరోవైపు టీడీపీ నేతల ఎదురుదాడితో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ కాస్తంత ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో సోమవారం లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు.
అవిశ్వాసానికి నిర్ణయం
భేటీలో జగన్ మాట్లాడుతూ.. ఉన్నవాళ్లే మనవాళ్లు అన్నారు. ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానంకు జగన్ నిర్ణయించారు. ఈ సందర్భంగా సభాపతి మీద అవిశ్వాసం పైన త్వరలో నిర్ణయం తీసుకుందామని ఎమ్మెల్యేలకు సూచించారు. కాగా, ఈ సమావేశానికి 47 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎమ్మెల్యేల ఫిరాయింపు, విభజన చట్టంలో పేర్కొన్న హామీలను సాధించడంలో టీడీపీ వైఫల్యం, స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం, తదితర అంశాలపై పార్టీ ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నట్లు సమాచారం.
దీంతో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ టీడీపీలోకి చేరిన సంగతి తెలిసిందే.