ఆఫర్: 2 గం.ల పాటు జంప్! ఆరెస్సెస్, బిజెపి నేతలతో జగన్ రహస్య చర్చలు?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దసరా పర్వదినం రోజున మధ్యాహ్నం రెండున్నర గంటల పాటు కనిపించకుండా పోయారని ప్రచారం సాగుతోంది.
అమరావతి/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దసరా పర్వదినం రోజున మధ్యాహ్నం రెండున్నర గంటల పాటు కనిపించకుండా పోయారని ప్రచారం సాగుతోంది.
ఆయన రహస్యంగా బిజెపి, విహెచ్పి, ఆరెస్సెస్ నేతలతో సమావేశమయ్యారని అంటున్నారు. హైదరాబాదులో ఓ బిజెపి ఎంపీ తనయుడు ఇంటికి వెళ్లిన జగన్ వారితో చర్చలు జరిపారని అంటున్నారు.
బిజెపి, ఆరెస్సెస్ నేతలతో చర్చలు
జగన్ తన మత విశ్వాసాల ప్రకారం దసరా వేడుకలు జరుపుకోరని, కానీ మంచిరోజు అంటే తాను నమ్మే పండితులు చెప్పిన దాని ప్రకారం దుర్గాష్టమి రోజున రాజకీయంగా ఓ కీలకమైన అడుగు వేశారనే ప్రచారం సాగుతోంది. ఆయన ఆరెస్సెస్, బిజెపి నేతలతో చర్చలు జరిపారని అంటున్నారు.
ఎవరికీ అపాయింటుమెంట్ ఇవ్వలేదు
జగన్ శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. అనంతరం పార్టీ భవిష్యత్తుపై చర్చించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లాంటి వారితో సమావేశమయ్యారు. అయితే శనివారం మాత్రం ఆయన ఎవరికీ అపాయింటుమెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది.
రెండున్నర గంటల పాటు ఎక్కడకు వెళ్లారంటే
జగన్ ఇంట్లో కూడా లేరని, ఓ బిజెపి ఎంపీ తనయుడి ఇంటికి వెళ్లారని అంటున్నారు. భోజనం అనంతరం జగన్ దాదాపు రెండున్నర గంటల పాటు కనిపించకుండా పోయారని అంటున్నారు. ఆ సమయంలో వారితో రెండు గంటల పాటు చర్చించారని తెలుస్తోంది.
వారితో భేటీ అయ్యారని ప్రచారం
ఏపీ బిజెపి ఎంపీ తనయుడు ఒకరు హైదరాబాదులో భవనం కట్టారని, అక్కడికే జగన్ వెళ్లారని అంటున్నారు. అక్కడ బిజెపి, ఆరెస్సెస్, విహెచ్పి నేతలతో సమావేశమైనట్లుగా తెలుస్తోందని ప్రచారం సాగుతోంది. రెండు గంటల పాటు వివిధ అంశాలపై మాట్లాడారని అంటున్నారు.
పాదయాత్ర కోసమూ కలిశారని ప్రచారం
జగన్ బిజెపితో కలిసి వెళ్లే అంశంపై చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. తాజా కలయికపై మరో చర్చ కూడా సాగుతోంది. పాదయాత్ర సమయంలో తనకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేలా కేంద్రం సహకరించేలా చూడాలని ఆయన కోరారని అంటున్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని ఏం చేయగలమని వారు జగన్తో అన్నారని అంటున్నారు.
బీజేపీకి జగన్ ఆఫర్
మరో ఆసక్తికర విషయం ఏమంటే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇరువురం కలిసి ముందుకు నడుద్దామని, బిజెపికి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు ఇస్తానని జగన్ వారితో చెప్పారని అంటున్నారు. అయితే, ప్రత్యేక హోదాపై ఇప్పటికే బిజెపి చిక్కుల్లో ఉంది. అలాంటిది జగన్ సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు ఇస్తానని చెప్పడం నిజమేనా అనే చర్చ సాగుతోంది.