ఇదీ సమస్య!: చినజీయర్ను కలిసిన జగన్, అరగంట భేటీ, 'బాబు రూ.15 లక్షల కోట్లు వెనుకేశారు'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం అంతా సిద్ధమయింది.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం అంతా సిద్ధమయింది.
పాదయాత్రకు చినజీయర్ స్వామి ఆశీస్సులు
ఈ నేపథ్యంలో వైయస్ జగన్.. చినజీయర్ స్వామిని కలిశారు. వైసిపి అధినేత మంగళవారం బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన జగన్ ఆయన వద్దకు వెళ్లారు. పాదయాత్రకు స్వామి ఆశీస్సులు తీసుకున్నారని తెలుస్తోంది.
30 నిమిషాల పాటు భేటీ, సమస్యలు చెప్పారు
చినజీయర్ స్వామితో వైయస్ జగన్ భేటీ దాదాపు ఆరగంట పాటు కొనసాగిందని తెలుస్తోంది. ఏపీలోని రాజకీయ పరిణామాలు, పార్టీలో ఎదురవుతున్న సమస్యలను కూడా జగన్ ఆయన ఎదుట ఉంచారని తెలుస్తోంది.
జగన్ వెంట సాయి, మైహోం రామేశ్వర రావు
జగన్ తన పాదయాత్ర గురించి చినజీయర్ స్వామికి చెప్పి ఆశీస్సులు తీసుకున్నారని తెలుస్తోంది. ఆ సమయంలో జగన్ వెంట వైసిపి రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి, మైహోం అధినేత జూపల్లి రామేశ్వర రావు కూడా ఉన్నారు.
బాబుపై రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపణ
ఏపీ సీఎం చంద్రబాబుపై జగన్ మేనమామ, వైసిపి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మంగళవారం తీవ్ర ఆరోపణలు చేశారు. అభివృద్ధి పేరుతో 15 లక్షల కోట్లను చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. టిడిపి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదన్నారు.
ఆ ఘనత వైయస్ రాజశేఖర రెడ్డిదే
పోతిరెడ్డిపాడు లైనింగ్ పనులను వెంటనే చేపట్టి, పూర్తి చేయాలని దిగువకు 22 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని రవీంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. 11 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోతిరెడ్డిపాడును రాయలసీమ రైతుల కోసం 44 వేల క్యూసెక్కులకు పెంచిన ఘనత వైయస్ రాజశేఖర రెడ్డిదే అన్నారు. సీమకు నీటిని అందిస్తున్నది తామేనంటూ టిడిపి నేతలు అబద్ధాలు చెబుతున్నారని, శ్రీశైలం రిజర్వాయర్లో గరిష్ట స్థాయిలో నీరు ఉన్నప్పటికీ పోతిరెడ్డిపాడుకు విడుదల చేయడం లేదని మండిపడ్డారు.