చేతి దులుపుకోవడం కాదు!: జగన్, బాధపడ్డ ఉమ్మారెడ్డి
న్యూఢిల్లీ: ప్రమాద బాధితులకు నష్టపరిహారం ఇచ్చేసి చేతులు దులుపుకోవడం సరికాదని, ఈ తరహా ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకునేలా ఆయా సంస్థల పైన ఒత్తిడి తీసుకు రావాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
వైయస్ జగన్ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన నగరం గ్యాస్ పైపు లైను పేలుడు అంశాన్ని ఆయనతో ప్రస్తావించారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో చోటుచేసుకున్న ఘటనల తరహాలో భవిష్యత్తులో ప్రమాదాలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ప్రమాద బాధితులకు నష్టపరిహారం ఇచ్చేయడంతోనే సరిపెట్టకుండా.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకోసం ఆయా సంస్థలపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.
బాబుపై మండిపడ్డ ఉమ్మారెడ్డి
పంట రుణాల రీషెడ్యూల్ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ చేసుకుంటున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. విభజన తర్వాతనే చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించారని, అన్ని రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చారన్నారు.
ఎన్టీఆర్, వైయస్సార్లు తొలి సంతకాలను అమలు చేసి చూపారన్నారు. చంద్రబాబు మాత్రం తొలి సంతకంతో కమిటీ వేశారన్నారు. రుణాల మాఫీ చంద్రబాబు తెలిసి చేసిన దగా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రీషెడ్యూల్ అంటే రైతులకు మరింత భారమేనని ఆవేదన చెందారు. మూడేళ్లలో లేదా ఐదేళ్లలోనైనా రుణాలు తీర్చాల్సిందేనన్నారు.