ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ: జాతీయ నేతలతో జగన్ వరుస భేటీలు(పిక్చర్స్)
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వరుస భేటీలతో బిజీబిజీగా సాగింది. ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వరుస భేటీలతో బిజీబిజీగా సాగింది. ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతోపాటు వివిధ జాతీయ పార్టీల నేతలకు వైయస్ జగన్ వివరించారు.జగన్ శుక్రవారం జైట్లీని, సమాజ్వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి, జేడీ(యు) నేత శరద్యాదవ్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలను కలిసి పార్టీ ఫిరాయింపులపై తన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యం ఖూనీ
జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్నారని ఆరోపించారు.
ఆవేదన..
అగ్రిగోల్డ్ డిపాజిట్దారుల ఆవేదనను ఆర్ధిక మంత్రి జైట్లీకి వివరించి, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరామని చెప్పారు. విజయవాడ దగ్గర హాయ్ల్యాండ్, యారడ వంటి విలువైన ఆస్తులను వేలానికి రాకుండా, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ డిపాజిటర్లకు నష్టం కల్గిస్తున్నారని వివరించినట్టు చెప్పారు.
నేతలతో భేటీలు
ముందుగా జగన్ ఆధ్వర్యంలో వైసీపీ నేతల బృందం సమాజ్వాది పార్టీ నేత ములాయంసింగ్ యాదవ్తోనూ, జేడీయూ నేత శరద్ యాదవ్ తోనూ, ఆ తరువాత సిపిఐ నాయకులు సురవరం సుధకర్రెడ్డి, డి రాజాలతోనూ భేటీ అయ్యారు
ఏచూరితో..
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిసిన జగన్ బృందం పార్టీ ఫిరాయింపుల విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లింది. పార్టీ ఫిరాయింపుల విషయంలో దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు కలిసి పోరాడాలని జగన్మోహన్ రెడ్డి శుక్రవారం రాత్రి సీతారాం ఏచూరిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అవినీతి రాజకీయాలకు పాల్పడుతుంటే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదన్నారు.
సురవరంతో..
సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి రాజాను శుక్రవారం వైయస్ జగన్ బృందం ఢిల్లీలో కలిసింది. అనంతరం సురవరం, జగన్మోహన్ రెడ్డిలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఫిరాయింపు రాజకీయాలకు సిపిఐ వ్యతిరేకమని ఈ సందర్భంగా సురవరం స్పష్టం చేశారు. జగన్ బృం దంలో ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, విజయసారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిథున్రెడ్డి, ఎమ్మెల్యే కోన రఘుపతి తదితరులు ఉన్నారు.
కలిసి పోరాడాలి
పార్టీ ఫిరాయింపులపై దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు కలిసి పోరాడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని జేడీయూ అధినేత శరద్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్లకు జగన్ విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీ తీరుపై జగన్.. పార్టీ ఎంపీలతో కలిసి శుక్రవారం ములాయం, శరద్ యాదవ్ లను కలిసి వివరించారు. ఈ విషయంలో వైసీపీకి మద్దతిస్తామని నేతలు ప్రకటించారు.