నెల్లూరు జైలుకు వెళ్లిన జగన్, 'టిడిపికి కాపులను దూరం చేసే కుట్ర'
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు నెల్లూరు జైలుకు వెళ్లారు. జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి, వైసిపి నేత మధుసూదన్ రెడ్డిలను పరామర్శించారు.
చిత్తూరు జిల్లా తిరుపతి విమానాశ్రయమేనేజర్ పైన దాడి కేసులో మిథున్ రెడ్డిని అయిదు రోజుల క్రితం చెన్నై ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారు. అనంతరం శ్రీకాళహస్తి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమం నాటి కేసులో చెవిరెడ్డిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపర్చడంతో ఈ నెల 29 వరకు ఆయనకు రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో జగన్ వారిని జైలులో కలిశారు.
కాపులను దూరం చేసే కుట్ర: బొండ ఉమ
టిడిపికి దన్నుగా ఉన్న కాపులను దూరం చేసేందుకు కొన్ని విపక్ష పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమ వైసిపిని ఉద్దేశించి విమర్శించారు. పలువురు కాపు నేతలు తమ స్వప్రయోజనాలు, రాజకీయ అస్థిత్వం కోసం కాపులను రెచ్చగొట్టే పనిలో ఉన్నారని దుయ్యబట్టారు.
తెలుగుదేశం పార్టీలో కాపులకు ఉన్నంత గుర్తింపు మరే పార్టీలోనూ లేదన్నారు. ఏ రాష్ట్రంలోనూ జీవో ఆధారంగా ఓ కులానికి రిజర్వేషన్లు కల్పించలేదన్న విషయాన్ని గుర్తించాలని కాపులకు సూచించారు. కాపులకు రిజర్వేషన్లకై తాను కూడా డిమాండ్ చేస్తున్నానని, ఇతర కులాలకు అన్యాయం జరుగకుండా కాపులకు న్యాయం చేయాలన్నదే తన అభిమతమన్నారు.