ఏపీ సర్కార్కు సింధుపై ఉన్న ప్రేమ రైతులపై లేదు!: జగన్..
ప్రభుత్వానికి పీవీ సింధు మీద ఉన్న ప్రేమ.. రైతులపై లేదని జగన్ విమర్శించారు. ఒక క్రీడాకారిణిగా సింధుపై అభిమానం ఉండటంలో తప్పులేదని, కానీ గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితిని కూడా గమ
అమరావతి: జీఎస్టీ బిల్లుకు ఆమోదముద్ర వేసేందుకు ఏపీ అసెంబ్లీ మంగళవారం నాడు సమావేశమైన సంగతి తెలిసిందే. అదే సమయంలో మిర్చి రైతుల గిట్టుబాటు అంశంపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. వైసీపీ తీర్మానాన్ని స్పీకర్ పక్కనపెట్టేయడంతో.. ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు.
దీంతో వైసీపీ సభ్యుల ఆందోళన నడుమే జీఎస్టీ బిల్లుకు ఆమోదముద్రపడింది. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. జీఎస్టీకి తాము వ్యతిరేకం కాదని, అదే సమయంలో రైతు సమస్యలపై మాట్లాడుదామంటే ప్రభుత్వం తప్పించుకుంటోందని మండిపడ్డారు.
ప్రభుత్వానికి పీవీ సింధు మీద ఉన్న ప్రేమ.. రైతులపై లేదని జగన్ విమర్శించారు. ఒక క్రీడాకారిణిగా సింధుపై అభిమానం ఉండటంలో తప్పులేదని, కానీ గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితిని కూడా గమనించాలని హితవు పలికారు. ఇప్పటివరకు మిర్చి కొనుగోలుకు కేవలం రూ.2కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు.
రైతులు సమస్యల్లో ఉంటే మిర్చి యార్డ్ మూసేయడమేంటని ప్రశ్నించిన జగన్.. చంద్రబాబు రైతు వ్యతిరేకి కాబట్టే యార్డ్ మూసేశారని అన్నారు. మిర్చికి కేంద్రం రూ.5వేలు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.