హోదాపై ఎందుకలా చేశారు?: తాజా పరిస్థతిపై బాబును నిలదీసిన జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చేందుకు పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ హామీలు ఇచ్చాయని గుర్తు చేశారు.
ఏ నైతిక విలువలతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తాజా రాజకీయ పరిస్థితులపై వైయస్ జగన్ శనివారం ట్విట్ చేశారు.
Recommended Video
హోదాను తాకట్టెందుకు పెట్టారు?
‘విభజన చేసినప్పుడే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ప్రకటించింది. పార్లమెంట్ వేదికగా అప్పటి పాలక, విపక్షాలు కలిసి మాటిచ్చాయి. మార్చి 2014లో ఇదే అంశాన్ని కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. ప్రత్యేక హోదా అమలు అంశాన్ని ప్రణాళికా సంఘానికి కూడా పంపారు. ఏ నైతిక విలువలతో చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు' అని జగన్ ప్రశ్నించారు.
ఏం చేశారో చెప్పండి..
అంతేగాక, ‘ఏమిస్తారో తెలియని ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెడతారా. మీ కంటి తుడుపు చర్యలు ఆపండి. ఏపీ ప్రజలకు ఏం చేశారో చెప్పండి' అని చంద్రబాబును వైయస్ జగన్ నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
హోదానే ఏపీకి సంజీవని
ప్రత్యేక హోదాయే రాష్ట్రానికి సంజీవని అని వైయస్సార్ర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. హోదా వల్ల పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. హోదా విషయంలో ఇలానే వ్యవహరిస్తే రాష్ట్రం 30ఏళ్లయినా వెనుకబాటుతనంలోనే ఉంటుందన్నారు. ఈ దుస్థితికి టీడీపీ సంపూర్ణ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా హోదాపై చిత్తశుద్ధి ఉంటే కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ మంత్రులు బయటకు రావాలని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
కమీషన్ల కోసం నాశనం చేస్తున్నారు
ప్రత్యేక హోదా కోసం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నాలు, రాష్ట్రంలో దీక్షలు చేశారని ఆయన అన్నారు. నాలుగేళ్లుగా తాము పోరాడుతుంటే చంద్రబాబు నీరుగార్చాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయి రాష్ట్ర భవిష్యత్ను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. కమీషన్ల కోసమే రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. హోదా కోసం ఇప్పుడు తాము పోరాడుతున్నామని టీడీపీ చేస్తున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉత్తరాఖండ్లో టీడీపీ నేతలు ఎందుకు పెట్టుబడులు పెట్టారని సజ్జన ప్రశ్నించారు.