ఢిల్లీలో వైసీపీ కార్నర్, అందుక జగన్ భేటీ!: బాబు చెప్పారు కానీ.. బీజేపీపై ధర్మాన ఆగ్రహం
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో సోమవారం భేటీ అయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పాదయాత్రలో ఉన్న ఆయన సాయంత్రం భేటీ అయ్యారు.
చదవండి: మీకు మాకు కాదు: బీజేపీతో కొట్లాటపై టీడీపీ ట్విస్ట్, మోడీపై యుద్ధమే: గల్లా జయదేవ్ ఘాటుగా
ఈ భేటీలో ఎంపీలు మిథున్ రెడ్డి, విజయ సాయి రెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డి, పార్టీ నేతలు ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, 2019 ఎన్నికలకు ఏ నినాదంతో వెళ్లాలి అనే తదితర అంశాలపై వారు చర్చిస్తున్నారు.
బీజేపీ, టీడీపీలు చేతులెత్తేశాయి
జగన్తో భేటీకి వెళ్లే సమయంలో ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, తెస్తామని టీడీపీ రెండూ మోసం చేశాయని, చేతులెత్తేశాయని ధ్వజమెత్తారు. టీడీపీ, బీజేపీలు హోదా విషయంలో వంచించాయని మండిపడ్డారు.
చంద్రబాబు ప్యాకేజీ ఉత్తమమని చెప్పారు కానీ
ప్రత్యేక హోదా కుదరదని బీజేపీ చెప్పిందని, దానికి కేంద్రం ఇస్తానన్న ప్యాకేజీ ఉత్తమమని చంద్రబాబు చెప్పారని ధర్మాన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆ ప్యాకేజీ కూడా లేదని మండిపడ్డారు. ఎన్డీయేలో కొనసాగుతూ టీడీపీ ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఓటుకు నోటుతో టీడీపీ బలహీనపడిందన్నారు. పోలవరం ప్రాజెక్టును తమ ప్రయోజనాల కోసం టీడీపీ ప్రభుత్వం నిర్మాణం కోసం తీసుకుందన్నారు.
ఢిల్లీ స్థాయిలో వైసీపీ కార్నర్
ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ ఎంపీలు పార్లమెంటు ఉభయసభల్లో నిరసనలు తెలిపారు. ఈ నిరసనల్లో ఢిల్లీ స్థాయిలో వైసీపీ కంటే టీడీపీ హైలెట్ అయింది. ఓ విధంగా ఢిల్లీ స్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టీడీపీ కార్నర్ చేసిందనే వాదనలు వినిపించాయి.
కీలక సమావేశం
ఈ నేపథ్యంలో జగన్ అధ్యక్షతన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భేటీ జరిగింది. కీలక సమావేశం నేపథ్యంలో ఏం నిర్ణయాలు తీసుకుంటారు, ప్రత్యేక హోదా, ప్యాకేజీ, బీజేపీ, టీడీపీ విషయాల్లో ఎలా ముందుకు సాగుతారనే చర్చ సాగుతోంది.