జగన్ డ్రైవర్కు అభినందన!, నేను వెళ్తే ఇక్కడ ఏముండదని జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ పార్టీ శ్రేణుల ప్రశంసలు అందుకుంటున్నారు. జగన్ శనివారం తూర్పు గోదావరి జిల్లా చాపరాయిలో పర్యటించారు.
రాజమహేంద్రవరం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ పార్టీ శ్రేణుల ప్రశంసలు అందుకుంటున్నారు. జగన్ శనివారం తూర్పు గోదావరి జిల్లా చాపరాయిలో పర్యటించారు.
జగన్ వెంట వచ్చిన వారు చాపరాయికి వెళ్లేందుకు ఈ ఘాట్ రోడ్డులో చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ రోడ్డులో సుమారు కిలోమీటరు ప్రయాణం చేస్తే చాపరాయి వస్తుంది. ఈ ఘాట్ రూట్లో వాహనాలు నడిపే సత్తా స్థానిక డ్రైవర్లకే ఎక్కువగా ఉంది.
జగన్-పవన్ కళ్యాణ్లకు 'సర్వే' షాక్: టిడిపిదే గెలుపు
మిగతా డ్రైవర్లు ఇక్కడ కొండను ఎక్కించాలంటే ఇబ్బంది పడతారు. లోయలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బొలెరో వంటి వాహనాలే సులభంగా వెళ్తాయట. జగన్ ఉన్న కారును డ్రైవర్ మాత్రం సులభంగా ఆ ఘాట్ను దాటించారు. జగన్ వెంట వచ్చిన ఇతరులు తమ వాహనాలను ఎక్కించలేక ఘాట్ రోడ్ల మధ్యనే ఉంచారు.
కాగా, చాపరాయిలో విష జ్వరాల కారణంగా 16 మంది మృతి చెందారు. బాధిత కుటుంబాలను జగన్ పరామర్శించారు. తాను తోడుగా ఉంటానని, అధైర్య పడవద్దని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
గడ్డి పెడితే మానవత్వం వస్తుందో
చంద్రబాబుకు పేదవాడు అంటే కోపమని, మానవత్వం లేని పాలనలో పేదలకు ఒరిగిందేం లేదని జగన్ మండిపడ్డారు. మన బాధలను చూస్తే ఆయనకు కొంచెమైనా బుద్ధి, జ్ఞానం వస్తుందో చూడాలన్నారు. గడ్డిపెడితే ఆయనలో మానవత్వం వస్తుందేమోనని ఎద్దేవా చేసారు. చాపరాయిలో విష జ్వరాల బారిన పడి మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసి పోరాడుదామన్నారు.
నేను వెళ్లాక చూస్తే ఇక్కడ ఏమీ జరగదు.. నాకు భయపడి
ఇక్కడ వరుసగా మృతి చెందుతున్న నేపథ్యంలో తాను ఏడాది కాలంలో మూడుసార్లు పర్యటించానని జగన్ చెప్పారు. తాను వస్తున్నానని తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు గిరిజనుల సమస్యలపై మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ తిరిగి వెళ్లిపోయాక ఇక్కడ ఏమైనా జరిగిందా అని చూస్తే, ఏమీ జరగదన్నారు. మళ్లీ ఏదైనా ఘటన జరిగితే జగన్ వస్తాడనే భయంతో ఏదేదో మాట్లాడుతారన్నారు.
చాపరాయి కష్టాలు
చాపరాయి గ్రామానికి రోడ్డు లేదని, తాగడానికి మంచి నీరు కూడా లేదన్నారు. ఒక్కటి కూడా పక్కా ఇల్లు లేదన్నారు. విద్యుత్ సౌకర్యం లేదని, అంబులెన్స్ రాదన్నారు. ఆసుపత్రికి వెళ్లాలంటే 34 కిలోమీటర్లు నడవాలన్నారు. మంత్రులు వచ్చినప్పుడు అడుగుతారని నోర్లు మూయిస్తున్నారని మండిపడ్డారు. గ్రామంలో ఆర్వో ప్లాంట్ పెడితే ఈ మరణాలు సంభవించవన్నారు. ఈ ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు రాదో చెప్పాలన్నారు.
వైద్యులు ఎలా వస్తారు?
రోగులు ఆశుపత్రులకు వెళ్తే అక్కడ వైద్యులు ఉండటం లేదని జగన్ అన్నారు. ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వం భర్తీ చేయడం లేదన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేయడానికి డాక్టర్లు ఇష్టపడటం లేదని మంత్రులు చెబుతున్నారని, డాక్టర్లు సిద్ధంగానే ఉన్నారని, కానీ ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు పెట్టి, వైద్యులను ఎంపిక చేసేందుకు సిద్ధంగా లేదన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో డాక్టర్లను తీసుకొస్తున్నారని, వారికి సరిగా జీతాలు ఇవ్వకుంటే ఎలా అన్నారు.