హోదా: జగన్ వీడియో చాట్ లింక్ ఇదే, నిప్పులు చెరిగిన నారాయణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు తెలియజేసేందుకు అందివచ్చిన ప్రతి ఒక్క చిన్న అవకాశాన్ని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ జేజార్చుకోవడం లేదు. హోదా ఆవశ్యకతను తెలియజేసేందుకు ఈ నెల 25వ తేదీన ప్రవాసాంధ్రులతో ముఖాముఖీ చర్చా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
లోటస్ పాండ్లోని వైసీపీ ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైయస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 25 (ఆదివారం) రాత్రి 8.30కి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఏపీకి హోదా సాధన కోసం రాష్ట్రంలో చేస్తున్న పోరాటం, హోదా ఆవశ్యకతపై ప్రవాసాంధ్రులతో జగన్ మాట్లాడనున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు, వైయస్ జగన్తో ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేశారు. ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసుకున్న లింకు ద్వారా కూడా దీనిని వీక్షించవచ్చు.
ప్రజా బ్యాలెట్లో పాల్గొన్న సీపీఐ నేత నారాయణ
ఏపీకి హోదా సాధన విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఇద్దరూ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. శనివారం తిరుపతిలో ప్రత్యేక హోదా కోసం ఏర్పాటు చేసిన ప్రజా బ్యాలెట్లో నారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వారిద్దరూ మాట మార్చారని ఆయన ఆరోపించారు. అంతేకాదు ఆయనకు సవాలు కూడా విసిరారు.
ఏపీకి రూ.2 లక్షల కోట్ల నిధులు వెంకయ్య తీసుకువస్తే శ్రీవారికి పాదపూజ చేస్తానని, నిధులు తేకుంటే వెంకయ్యనాయుడు ముక్కు నేలకు రాయాలని నారాయణ సవాలు విసిరారు.
వెంకయ్య డబ్బా కొట్టుకోవడం మానేసి ఇచ్చిన హామీలు నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు.
రాష్ట్రం నుంచి అనేక ప్రాజెక్టులు తరలిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం ప్రజా ఉద్యమం జరుగుతుందన్నారు. ఈ ఉద్యమంలో చంద్రబాబు, వెంకయ్య కొట్టుకుపోతారని అన్నారు.