ఇది మీ విజయం, వచ్చింది మీ ప్రభుత్వం: వైఎస్ జగన్
అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ముగిసిన ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తండ్రిలాగే ప్రజలకు మేలు చేయాలని తాను ఆశించానని అన్నారు. ప్రజల ఆశీస్సులు, భగవంతుడి కృప ఈ అపూర్వ విజయం సాధించగలిగామని అన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ తప్పకుండా అమలు చేస్తారని అన్నారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు తమను అక్కున చేర్చుకున్నారని అన్నారు. రాజకీయంగా ప్రత్యర్థుల నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నామని, కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నామని ఆమె పరోక్షంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోందంతాన్ని గుర్తు చేశారు. ప్రజలు తమకు, తమ కుటుంబానికి అండగా నిల్చోవడంతో ఎంతటి కష్టమైనా భరించామని చెప్పారు.
నేను చూసా..నేను విన్నా.. నేను ఉన్నా: ప్రజా విశ్వాసం నిలబెట్టుకుంటా: జగన్ తొలి సందేశం..!
తమకు అండగా ఉన్న రాష్ట్ర ప్రజలే.. తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేశారని, పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించారని చెప్పారు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రజలకు మేలు చేయడానికి తన కుమారుడు ఎంత వరకైనా వెళ్తారని అన్నారు. ప్రతి ఒక్కరి సంక్షేమం గురించి ఆలోచించారని, చిట్ట చివరి వ్యక్తికి కూడా లబ్ది కలిగిస్తారని తాను ఆశిస్తున్నానని చెప్పారు. ప్రజా ప్రభుత్వంగా పరిపాలనను మార్చుతారని అన్నారు.