సీట్ల పంపకాల కోసం రవి ఇంట్లో జగన్తో పవన్ కళ్యాణ్ భేటీ!: వైసీపీ నేత ఏం చెప్పారంటే?
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ఇటీవల రహస్యంగా కలుసుకున్నారని, దీనిపై సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సోమవారం స్పందించారు.
సీట్ల పంపకాల కోసం రవి ఇంట్లో జగన్, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారా?
టీడీపీ నేతలు చెబుతున్నట్లు జగన్, పవన్ కళ్యాణ్లు కలుసుకోలేదని తేల్చి చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాము ఏ పార్టీతోను పొత్తు పెట్టుకునేది లేదని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. విశాఖపట్నం వైసీపీ నేత రవి ఇంట్లో జగన్ను పవన్ కళ్యాణ్ కలిశారని, ప్రచారం చేస్తున్నారని, ఆ వార్తల్లో నిజం లేదని కౌంటర్ ఇచ్చారు.
ఆస్తులపై చంద్రబాబు కన్నేశారు
సీబీఐ, ఈడీలను రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవటం వెనుక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వార్థం దాగి ఉందని బొత్స ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై చంద్రబాబు కన్నేశారన్నారు. అందుకే హాయ్ ల్యాండ్, విశాఖపట్నంలోని బీచ్ రిసార్టులు అగ్రిగోల్డ్ ఆస్తులు కావని అసత్య ప్రచారం చేయిస్తున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక భారీగా అవినీతి, అక్రమాలు చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్తో చేతులు కలిపారు
కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పునాదులపై నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని బొత్స అన్నారు. ఇన్నేళ్లు బద్ధ శత్రువుగా ఉన్న అదే పార్టీతో చంద్రబాబు చేతులు కలిపారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ప్రజాస్వామ్యాన్ని బతికిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
అధికారులే చెబుతున్నారు
చంద్రబాబు రాష్ట్రంలో పేరుకుపోయిన అవినీతిని పట్టించుకోడని బొత్స అన్నారు. కానీ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, దేశాన్ని రక్షిస్తానని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. ఏపీలో జరుగుతున్న అవినీతి, టీడీపీ నాయకుల అక్రమాలపై కేంద్రం స్పందించకవడం దారుణమన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం రూ.20 వేల కోట్లు ఇస్తే 7 వేల కోట్లు దారి మళ్లించారన్నారు. రూ.ఏడు వందల కోట్లను ఒక మీడియాలో ప్రచారం కోసం ఇచ్చారన్నారు. రూ.450 కోట్లు విలువ గల భూమిని రూ.45 లక్షలకే ప్రభుత్వం కేటాయించిన దాఖలాలు ఉన్నాయన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అవినీతి తారాస్థాయికి చేరిందని ప్రభుత్వ ఉన్నతాధికారులే చెబుతున్నారన్నారు.
తప్పులు చేసి బయట దేశాలకు పారిపోయినట్లుగా
అగ్రిగోల్డ్ ఆస్తుల్లో అవకతవకలు, విశాఖపట్నం భూముల కుంభకోణం, ఇలాంటి వాటిని చంద్రబాబు పట్టించుకోవడం లేదని బొత్స అన్నారు. టీడీపీ నాయకుల బండారం బయటపడుతుందనే సీబీఐ ప్రవేశ రద్దుపై జీవో తెచ్చారన్నారు. తప్పులు చేసి బయట దేశాలకు పారిపోయినట్లుగా దేశంలో తప్పు చేసిన నాయకులు ఏపీలో తలదాచుకునే విధంగా చంద్రబాబు పాలన ఉందన్నారు. చంద్రబాబులాంటి మోసకారితో కాంగ్రెస్ కలవడం ఏమిటన్నారు. జాతీయ పార్టీలు చంద్రబాబు అవినీతి పాలనపై మాట్లాడవలసిన అవసరం ఉందన్నారు.