జగన్ ఫ్యామిలీని చూడాలన్నా: బుద్ధా, తెలంగాణలో పోటీపై జగన్ నిర్ణయం మీద విజయసాయి
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డిల పాస్ పోర్టులను న్యాయస్థానం గతంలోనే జఫ్తు చేసిందని తెలుగుదేశం పార్టీ నేత, ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న మంగళవారం అన్నారు. నాలుగేళ్ల క్రితమే వారి పాస్పోర్టులను రద్దు చేయించుకున్నారన్నారు.
'జగన్, పవన్ కళ్యాణ్లు ఓట్లు ఎలా అడుగుతారు, ఆ సభలో బాబు కీలక ప్రకటన'
ఫ్యామిలీని చూడాలన్నా కోర్టు అనుమతి కావాల్సిన ఆర్థిక ఉగ్రవాదులు
అలాంటి మీరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ల గురించి మాట్లాడుతారా అని బుద్ధా ప్రశ్నించారు. వారిని విమర్శించే అర్హత మీకు లేదన్నారు. కుటుంబ సభ్యులను చూడాలన్నా కూడా కోర్టు అనుమతి తీసుకోవాల్సిన ఆర్థిక ఉగ్రవాదులు జగన్, విజయసాయి రెడ్డి అని తీవ్ర విమర్శలు చేశారు.
వీటికి సమాధానం చెప్పాలి, జనం నిలదీయాలి
రూ.36వేల కోట్లు ఈడీ ఎందుకు జఫ్తు చేసిందో చెప్పాలని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. జైలుకు ఎందుకు వెళ్లారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు ఎందుకు వెళ్తున్నారో కూడా చెప్పాల్సిన బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. ఈ అంశాలపై ప్రజలు ప్రతిపక్ష నేత జగన్ను నిలదీయాలన్నారు.
తెలంగాణలో పోటీ మీద జగన్ నిర్ణయంపై విజయసాయి
తెలంగాణలో పోటీపై తమ పార్టీ అధినేత వైయస్ జగన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని విజయసాయి రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో కూడిన మహాకూటమికి ప్రజలు గట్టి బుద్ధి చెబుతారన్నారు.
టీడీపీకి ఆఖరి రోజులు
ఆదాయపన్ను శాఖ దాడులు అంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని విజయసాయి రెడ్డి నిలదీశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ఐదు లక్షలకోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి రాగానే వాటిని తిరిగి రాబడుతుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ఆఖరి రోజులు వచ్చాయని అన్నారు.