కేంద్రమంత్రిని చేస్తా: జగన్, సిఎంగా ప్రమాణం: మేకపాటి
హైదరాబాద్/నెల్లూరు: నెల్లూరు లోకసభ స్థానానికి పోటీ చేస్తున్న మేకపాటి రాజమోహన్ రెడ్డిని కేంద్రమంత్రిగా చేస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఆయన సీమాంధ్రలో జోరుగా పర్యటిస్తున్నారు. కేంద్రంలో తామే చక్రం తిప్పుతామని, మేకపాటిని కేంద్రమంత్రిని చేస్తానని ఆదివారం నెల్లూరు ప్రచారంలో అన్నారు.
సోమవారం ప్రకాశం జిల్లాలో జగన్ ఎన్నికల ప్రచారం సాగింది. ఈ సందర్భంగా ఆయన టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన నిప్పులు చెరిగారు. టిడిపి ఎంపీలు విభజనకు అనుకూలంగా ఓటు వేశారని, రాష్ట్ర విభజనలో చంద్రబాబు కూడా భాగస్వామియే అన్నారు. చంద్రబాబు నాయుడికి విశ్వసనీయత అంటే అర్థం తెలియదన్నారు.
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు
ఎన్నికల తర్వాత వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని మేకపాటి రాజమోహన్ రెడ్డి సోమవారం అన్నారు. జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో సభలో మాట్లాడారు. సీమాంధ్రలోని అన్ని స్థానాలను తమ పార్టీ గెలుచుకుంటుందన్నారు. తెలంగాణలోనూ తమ పార్టీ సత్తా చాటుతామన్నారు. మహబూబాబాద్, ఖమ్మం, మల్కాజిగిరి ఎంపీ స్థానాలను గెల్చుకుంటామని, కేంద్రంలోను జగన్ చక్రం తిప్పుతారన్నారు.
చెత్త పోయింది: రఘువీరా
ప్రస్తుత ఎన్నికలు డబ్బున్న శ్రీమంతులకు, మధ్యతరగతి కుటుంబాలకు మధ్య జరుగుతున్న సంగ్రామమని రఘువీరా రెడ్డి అన్నారు. కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించిన బలహీన మనస్కులు, అవకాశవాదులంతా ఆస్తిపాస్తులను, వ్యాపారాలను కాపాడుకోవడానికి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారన్నారు. వారంతా పార్టీని వీడినందుకు తొలుత బాధపడ్డా, ఇప్పుడు సంతోషిస్తున్నామన్నారు. అవకాశవాదులు పోయినందుకు కొత్తవారికి అవకాశం వచ్చిందన్నారు.
ఒక్క చిత్తూరు జిల్లాలోనే 14 మంది ఎమ్మెల్యే స్థానాలుంటే... 13 మంది కొత్త వారికి అవకాశం దక్కిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, నిజాయతీపరులు, మధ్యతరగతి ప్రజలు పార్టీలోకి రావడం మార్పునకు శుభసూచకమన్నారు. పాత చెత్త అంతా పోయి... పార్టీలోకి కొత్త రక్తం వచ్చిందన్నారు.