మాకు దెబ్బతగిలింది, ఐదేళ్లకి మళ్లీ వస్తా: బాబుపై జగన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల ఫలితాల పైన శుక్రవారం స్పందించారు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ హవా, చంద్రబాబు తప్పుడు హామీలు తమ ఓటమికి కారణమని జగన్ అన్నారు. చంద్రబాబు తన తప్పుడు హామీలతో ప్రజలను నమ్మించారని విమర్శించారు.
వచ్చే ఐదేళ్ల పాటు తాము ప్రజల తరఫున పోరాటం చేస్తామని, మళ్లీ వస్తామన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పారు. తమకు ఓటేసిన ప్రతి ఒక్కరికి తాను చేతులు జోడించి పేరుపేరునా హృదయ పూర్వక కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. తాము ఏమీ ప్రభుత్వంలో ఉండి ప్రతిపక్షంలోకి రాలేదన్నారు.
తాను కాంగ్రెసు పార్టీ నుండి బయట అడుగు పెట్టినప్పుడు తాను, తన అమ్మ.. ఇద్దరం మాత్రమే ఉన్నామని, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో తాము ఘన విజయం సాధించామని, ఇరవై మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలం అయ్యామన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున పోరాడి ఐదేళ్ల తర్వాత మళ్లీ వస్తామన్నారు.
ఇన్నాళ్లు ప్రజల పక్షాన, ప్రజా సమస్యల పైన ఆందోళనలు, ధర్నాలు చేసింది తానేనని, ఎక్కడా చంద్రబాబు లేరన్నారు. ప్రతి సమస్య పైన తాను స్పందించానని చెప్పారు. ఫీజు రీయింబర్స్ నుండి రైతు సమస్యల వరకు అన్నింటి పైనా తాను ధర్నా చేశానన్నారు. ప్రతి ఉద్యమం తానొక్కడినే చేశానని చెప్పారు.
మోడీ గాలికి, బాబు తప్పుడు హామీలు తోడయ్యాయని, చంద్రబాబు ప్రజలను నమ్మించడం వల్లనే తమకు దెబ్బ తగిలిందన్నారు. తమకు ఎవరితోను ఎలాంటి పొత్తులు అవసరం లేదన్నారు. తాము ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. ప్రజల మనసులో చోటు సంపాదించుకుంటే చాలన్నారు. ప్రజల తీర్పును తాను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నానని చెప్పారు.