మా పార్టీలోకి వస్తారనుకోలేదు: యలమంచిలితో జగన్, ‘తూర్పు’ సీటుపై చర్చ
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమైన టీడీపీ నేత యలమంచిలి రవి మధ్య ఆసక్తికర చర్చ సాగింది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డితో యులమంచిలి రవి ఏకాంతంగా భేటీ అయ్యారు.
Recommended Video
టీడీపీకి గట్టి షాక్: వైసీపీలోకి యలమంచిలి రవి, బాబు బుజ్జగించినా నో!
ఈ సందర్బంగా 'మీరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని అనుకోలేదని, వచ్చినందుకు కృతజ్ఞతలు' అని జగన్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. తాను వైసీపీలోకి వస్తే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే సీటును ఆశిస్తున్న ఆశావహులకు ఇబ్బంది కలుగుతుందేమోనని రవి ప్రస్తావించారు.
అయితే, ఇప్పటివరకూ ఎవరికీ ఎటువంటి కమిట్మెంట్ను తాను ఇవ్వలేదని జగన్ స్పష్టం చేసినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఏప్రిల్ 14న (శనివారం) జగన్ పాదయాత్ర విజయవాడకు చేరనుంది.
ఈ సందర్భంగా భారీ ఎత్తున తన అనుచరులతో వచ్చి యలమంచిలి రవి యస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. టీడీపీలో సరైన గుర్తింపు ఇవ్వకపోవడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు రవి స్పష్టం చేశారు. ఇప్పటికే చంద్రబాబు.. యలమంచిలిని బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.