ఏపీలో పెళ్లిళ్లకు 150 మందికే అనుమతి-సీఎం జగన్ కీలక ఆదేశం
ఏపీలో కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఇప్పటికీ వందల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా ధర్డ్ వేవ్ భయాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు కోవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా చూడాలని సీఎం జగన్ ఇవాళ మరోసారి అధికారుల్ని ఆదేశించారు.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. పెళ్లిళ్ల సీజన్లో పెద్ద ఎత్తున ప్రజలు ఒక చోటకు వచ్చే అవకాశాలున్నాయని, కోవిడ్ వ్యాప్తికి దారితీసే అవకాశాలున్నాయని సీఎం జగన్ తెలిపారు. కాబట్టి పెళ్లిళ్ల సహా శుభకార్యాల్లో వీలైనంత తక్కువమంది ఉండేలా చూడాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. కోవిడ్ నివారణా చర్యలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. పెళ్లిళ్లల్లో 150 మందికే పరిమితం చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు.
పెళ్లిళ్లతో పాటు ఊరేగింపులు, మతపరమైన కార్యక్రమాల్లో కూడా ఎక్కువ జనం గుమిగూడకుండా చూడాలని అధికారుల్ని సీఎం జగన్ ఆదేశించారు. మాస్కులు వేసుకునేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు దీనిపై మార్గదర్శకాలు జారీచేయాలని ఆదేశాలు ఇఛ్చారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగేంతవరకూ జాగ్రత్తలు తప్పనిసరని సీఎం జగన్ తెలిపారు. వచ్చే రెండు నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు.