కృష్ణాలో అడుగుపెట్టిన జగన్: పాదయాత్రలో భారీగా జనం, ‘బాబుకు గాజులు పంపారు’
Recommended Video
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 136వ రోజు పాదయాత్ర శనివారం ఉయదం కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. కనకదుర్గ వారధి వద్ద వైయస్ జగన్ కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టారు.
ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు వైయస్ జగన్కు ఘనస్వాగతం పలికారు. పలువురు అభిమానులు ఆయనతో చేతులు కలిపేందుకు, ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. కాగా, పాదయాత్ర సందర్బంగా యలమంచిలి రవి వైయస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వంగవీటి రాధ కూడా వైయస్ జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు.
పోటెత్తిన జనం
జననేతతో కలసి అడుగు వేసేందుకు జనం భారీగా తరలిరావడంతో కనకదుర్గ వారధి పోటెత్తింది. వైయస్ జగన్ను కలిసేందుకు కృష్ణా జిల్లా లాయర్లు కనకదుర్గ వారధికి చేరుకున్నారు. జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 270 కిలోమీటర్ల మేర వైయస్ జగన్ పాదయాత్ర చేయనున్నారు.
కృష్ణాలో యాత్ర ఇలా..
శనివారం పాదయాత్రలో భాగంగా కనకదుర్గ వారధి గుండా ఫ్లైఓవర్ బ్రిడ్జి, వెటర్నరీ ఆస్పత్రి సెంటర్, శిఖామణి సెంటర్, పుష్పా హోటల్ సెంటర్, సీతారాంపురం సెంటర్ మీదుగా కొత్తవంతెనకు చేరుకుంటారు. అక్కడినుంచి బీఆర్టీఎస్ రోడ్డు, మీసాల రాజారావు రోడ్డు, ఎర్రకట్ట మీదుగా చిట్టినగర్కు వరకు పాదయాత్ర కొనసాగుతుంది.
చిట్టినగర్ సెంటర్లో బహిరంగ సభ
చిట్టినగర్ సెంటర్లో జరిగే బహిరంగం సభలో జగన్ ప్రసంగిస్తారు. చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ వద్ద యాత్ర ముగిస్తారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడంతోపాటు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా గత నవంబర్ 6న ఇడుపుల పాయ నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.
భారీగా ట్రాఫిక్ జాం
ఇప్పటి వరకు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకొని శనివారం ఉదయం దుర్గమ్మ సాక్షిగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించారు వైయస్ జగన్ను కలిసేందుకు కృష్ణా జిల్లా లాయర్లు కనకదుర్గ వారధికి చేరుకున్నారు. పాదయాత్రతో విజయవాడలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.
ఏకైక వ్యక్తి అంబేద్కర్
భారత రాజ్యాంగ సృష్టికర్త బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. దళితులు, మహిళలు, కార్మికుల కోసం పోరాడిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ అని ట్విట్టర్ వేదికగా ఆయన కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలు నేటికీ మనందరికీ స్ఫూర్తిదాయమన్నారు. కాగా అంబేద్కర్ జయంతిని రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవంగా పాటించాలని వైసీపీ నిర్ణయించింది. సేవ్ డెమొక్రసీ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద వైసీపీ శ్రేణులు నిరసనలు తెలుపనున్నాయి.
బాబుకు చీర, గాజులు పంపారు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చీర, గాజులు, పసుపు, కుంకుమను వైయస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం పంపింది. అనంతపురం నగర అధ్యక్షురాలు కృష్ణవేణి ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని టవర్ క్లాక్ నుంచి ప్రధాన తపాలా కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించి... చీర, గాజులు, పసుపు, కుంకుమను పోస్ట్ బాక్సులో వేశారు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్నది వైసీపీనే అని ఈ సందర్భంగా మహిళా నేతలు తెలిపారు. చంద్రబాబు చేతకాని తనంతో రాష్ట్రానికి హోదా రాలేదని, అందుకే వీటన్నింటినీ ఆయనకు పంపిస్తున్నామని చెప్పారు.