ఇరికిస్తారా?: ఛీ! ఆడోళ్లని వీడియో తీశారు, బాబు డబ్బు: జగన్, చింతమనేని కౌంటర్
హైదరాబాద్: కాల్ మనీ కేసులో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వైసిపి, దానికి సరైన సమాధానం చెప్పేందుకు అధికార తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. గురువారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో టిడిపి నేతలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు, టిడిపి ఎమ్మెల్యేలు నివాళులు అర్పించి అసెంబ్లీకి బయలుదేరారు. జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు రవీంద్ర భారతి నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
కాల్ మనీ, సెక్స్ రాకెట్లో టిడిపి నేతల ప్రమేయం ఉందని జగన్ ఆరోపించారు. ప్రజలకు అధికార పార్టీ తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసును డైవర్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దౌర్భాగ్యపు రాజకీయాలకు టీడిపి పాల్పడుతోందన్నారు.
విజయవాడలో హేయమైన కాల్ మనీ వ్యవహారంలో ఆడవాళ్లను ఆట వస్తువులుగా ఉపయోగించుకొని సెక్స్ రాకెట్కు పాల్పడితే, అందులో కూడా చంద్రబాబు ఆ పార్టీ నేతలు కనిపిస్తుంటే దీనిని మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇదేదో వడ్డీ వ్యాపారం అన్నట్లుగా వడ్డీ వ్యాపారుల మీద దాడులు చేస్తున్నారన్నారు.
వందల మందిని అరెస్టు చేస్తారని, వాళ్లలో కూడా ప్రతిపక్షాల వాళ్లే ఎక్కువ ఉన్నారని దుయ్యబట్టారు. ఇంత కంటే దారుణం మరొకటి లేదన్నారు. చంద్రబాబు అండదండలతోనే నేరుగా డిజి ఇంటెలిజెన్స్తో నిందితులు చర్చలు జరుపుతున్న ఫోటోలు కూడా ఉండగా, ఎమ్మెల్యే విదేశీ పర్యటనలకు వెళ్లడం, ఆయనతో పాటు ఉన్న నిందితుడు మాత్రం తిరిగి రాకపోవడం చూస్తున్నామన్నారు.
200కు పైగా వీడియో టేపుల్లో అమ్మాయిలను అశ్లీలంగా చిత్రాలు తీసి వారిని బ్లాక్ మెయిల్ చేస్తుంటే, అందులో ముఖ్యమంత్రి డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి ఆసెక్స్ రాకెట్ నుంచి కేసును తప్పుదోవ పట్టించేందుకు ఇది కేవలం వడ్డీ వ్యాపారంతో సంబంధమున్న దానిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
పోలీసులను చంద్రబాబు తనకు అనుకూలంగా వాడుకుంటున్నారన్నారు. మేం అసెంబ్లీ గేటు వద్దే ఉంటామని, అవసరమైతే టిడిపి ఎమ్మెల్యేలను లోనికి కూడా పోనివ్వమని జగన్ అన్నారు. దీనిపై జగన్ ఒక్కడే పోరాడితే న్యాయం జరగదని, అందరు కలిసి రావాలన్నారు.
చింతమనేని కౌంటర్
కాల్ మనీ కేసులో మొత్తం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఉన్నారని టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. దొంగే దొంగ అన్నట్లు జగన్ తీరు ఉందని ఎద్దేవా చేశారు.