కుప్పం గడ్డపై జగన్! తన పరిపాలన మీద తనకే నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు!
Recommended Video
చిత్తూరు: ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం చిత్తూరు జిల్లా కుప్పంలో అడుగు పెట్టారు. పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్ షో నిర్వహించారు. బహిరంగ సభలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో ఆయన, ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతిని ప్రస్తావిస్తూ చెలరేగిపోయారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయిదేళ్ల పాలనను, చంద్రబాబు అయిదేళ్ల పాలనను బేరీజు వేసుకోవాలని జగన్ కుప్పం ఓటర్లకు సూచించారు. 30 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఎన్నిక అవుతున్నప్పటికీ.. కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి ఎందుకు నోచుకోలేదని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో మాత్రమే.. కుప్పానికి ఓ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల మంజూరైన విషయాన్ని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సొంత నియోజకవర్గానికి ద్రోహం చేశారు..
జలయజ్ఞం పథకంలో భాగంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుప్పం నియోజకవర్గంలోని గణేష పురం వద్ద పాలార్ నీటి ప్రాజెక్టును కట్టడానికి ప్రయత్నించగా.. స్వయంగా చంద్రబాబే అడ్డుకున్నారని జగన్ చెప్పారు. పాలార్ ప్రాజెక్టుకు అవసరమైన డీపీఆర్ లను కూడా వైఎస్ హయాంలో రూపుదిద్దుకున్నాయని అన్నారు. వైఎస్ ఆ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే సొంత నియోజకవర్గం ప్రజలను తనను ఛీకొడతారనే భయంతో చంద్రబాబు తమిళనాడు ప్రభుత్వంతో చేతులు కలిపి, న్యాయస్థానంలో కేసు వేయించారని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే- పాలార్ ప్రాజెక్టు నిర్మణానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. తాను మాట ఇస్తే, మరిచిపోనని, మాట తప్పనని అన్నారు.
పాలన మీద చర్చ పెట్టే ధైర్యం ఉందా?
తన అయిదేళ్ల పరిపాలనను చూపించి చంద్రబాబు ఓట్లు ఎందుకు అడగలేకపోతున్నారని వైఎస్ జగన్ అన్నారు. తన అయిదేళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి పని కూడా చంద్రబాబు చేయలేదని చెప్పారు. ఆయన పరిపాలన మీద ఆయనకే నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. అందుకే- తాను చేసిన అభివృద్ధి పనులు చూపించి, ఓట్లు అడిగే సాహసం చేయలేకపోతున్నారని జగన్ విమర్శించారు. మరోసారి అధికారంలోకి వస్తే.. ఏ పనులు చేస్తాననే విషయాన్ని కూడా చంద్రబాబు స్పష్టంగా చెప్పట్లేదని అన్నారు. చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడం వల్లే.. తన రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ కాలం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. అయిదేళ్ల పాలనలోనే కాదు.. 30 ఏళ్లలో కుప్పం నియోజకవర్గానికి కనీస వసతులను కూడా కల్చించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. చంద్రబాబును ఒకసారి విశ్వసించి, అయిదేళ్ల సమయాన్ని ఇచ్చామని, అయినప్పటికీ.. రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనులు పూర్తి కాలేదని అన్నారు.
ఎన్నికల ప్రచారంలో జగన్: హోరెత్తిన జనం (ఫొటోలు)
ఓటుకు మూడువేలు ఇచ్చే కుట్ర..
పోలింగ్ కు మరోవారం రోజుల సమయం కూడా లేదని, ఈ వ్యవధిలో చంద్రబాబు అన్ని గ్రామాలకు డబ్బులు పంపించే కుట్రకు తెర తీస్తారని జగన్ హెచ్చరించారు. గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు పంపించి, ఓటుకు మూడువేల రూపాయలను ఇవ్వడానికి సిద్ధపడ్డారని ఆరోపించారు. మూడు వేల రూపాయలతో మరోసారి అధికారంలోకి రావాలనే కుట్రకు పాల్పడబోతున్నారని అన్నారు. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోస పోవద్దని జగన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. వృద్ధులకు మూడువేల రూపాయల పింఛన్ ఇస్తామని అన్నారు. 2000 రూపాయల పింఛన్ ఇస్తానని తాను ప్రకటిస్తే.. దాన్ని కాపీ కొట్టారని అన్నారు. ఎన్నికలు రాకపోయి ఉంటే.. తాను రెండు వేల రూపాయల పింఛన్ ఇస్తామని ప్రకటించకపోయి ఉంటే ఏమై ఉండేదని జగన్ ప్రశ్నించారు. రైతులకు 50 వేల రూపాయల పెట్టుబడి పథకం, గిట్టుబాటు ధర కల్పిస్తామని, దీనికి తాను గ్యారంటీ ఉంటానని జగన్ అన్నారు.
బీసీల సీటును లాక్కున్న చంద్రబాబు..
జనాభా లెక్కల ప్రకారం.. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బీసీలు ఎక్కువగా ఉన్నారని, నిజానికి- ఇక్కడ బీసీ అభ్యర్థిని నిలబెట్టాల్సి ఉందని జగన్ అన్నారు. బీసీ నాయకులకు కేటాయించిన సీటును చంద్రబాబు లాక్కుని, 30 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్నారని విమర్శించారు. చంద్రగిరిలో తాను జీవితంలో గెలవలేనని తెలుసుకుని కుప్పానికి పారిపోయి వచ్చారని చుకలు అంటించారు. తొమ్మిదిన్నరేళ్ల పరిపాలనలో చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి 18 వేల ఇళ్లు మాత్రమే మంజూరు చేస్తే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో.. ఇక్కడ 43 వేల ఇళ్లను కట్టించారని గుర్తు చేశారు. 2014 నుంచి 2019 వరకు కేవలం 5,500 ఇళ్లను మాత్రమే మంజూరు చేశారని అన్నారు.
కుటుంబాన్ని మోసం చేసిన పెద్ద కొడుకు..
చంద్రబాబు తన కుటుంబంలో పెద్ద కొడుకేనని, అందుకే- కుటుంబం మొత్తాన్నీ మోసం చేశారని జగన్ అన్నారు. అమ్మణ్ణమ్మకు నలుగురు సంతానంలో చంద్రబాబు పెద్ద కొడుకని. సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడితో పాటు ఇద్దరు చెల్లెళ్లకు కూడా వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. తల్లి పేరు మీద హైదరాబాద్ లో ఉన్న ఆస్తిలో రామ్మూర్తి నాయుడితో పాటు చెల్లెళ్లకు భాగస్వామ్యం కల్పించాల్సిన చంద్రబాబు..దాన్ని తన కుమారుడు లోకేష్ పేరు మీద రాశారని అన్నారు. అలాంటి వ్యక్తి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటే ఏ కుటుంబం కూడా బాగుపడదని అన్నారు. చంద్రబాబు తనను ద్రోహం చేశారని రామ్మూర్తి నాయుడు వందల సార్లు చెప్పారని, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో కూడా తెలియట్లేదని చెప్పారు.