మోడీతో జగన్ రాజీ? కాంగ్రెసుకు ఊరట: చంద్రబాబు హ్యాపీ
తాజా పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులకు కారణమవుతున్నాయి. గుంటూరులో జాతీయ స్థాయి నాయకులతో కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాపై సభ నిర్వహించిన తర్వాత రాజకీయాలు మారే సూచనలు కనిపిస్తున్నాయ
హైదరాబాద్: తాజా పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులకు కారణమవుతున్నాయి. గుంటూరులో జాతీయ స్థాయి నాయకులతో కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాపై సభ నిర్వహించిన తర్వాత రాజకీయాలు మారే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రధాని మోడీతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయిన తర్వాత పరిణామాలను కాంగ్రెసు తనకు అనుకూలంగా మలుచుకున్నట్లు కనిపిస్తోంది. కేసుల నుంచి తప్పించుకోవడానికి వైయస్ జగన్ ప్రధాని మోడీతో రాజీ పడ్డారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ, మోడీతో జగన్ భేటీ వల్ల తెలుగుదేసం పార్టీ ఆరోపణలకు బలం చేకూర్చినట్లయింది. ఈ స్థితిలో ప్రత్యేక హోదా కోసం జగన్ పోరాడలేరనే అభిప్రాయం క్రమంగా బలపడుతున్న క్రమంలో రాహుల్ గాంధీ గుంటూరు సభ జరిగింది. సభకు ఉవ్వెత్తున ప్రజలు రాకపోయినప్పటికీ స్పందన ఫరవాలేదనిపించింది. ఆ రకంగా జగన్ కాంగ్రెసు పార్టీకి ఊరటనిచ్చారు.
కాంగ్రెసు ఇలా...
రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన గత ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ చావుదెబ్బ తిన్నది. కాంగ్రెసును ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఆ తర్వాత మూడేళ్లకు కాంగ్రెసు పార్టీ నాయకులు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదాపై జగన్ రాజీ పడ్డారనే ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో రాహుల్ సభ కాస్తా కాంగ్రెసు పార్టీ నేతలకు ఊరటను ఇచ్చింది. రాహుల్ గాంధీ కూడా వ్యూహాత్మకంగా చంద్రబాబుపైనే కాకుండా జగన్పై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు, జగన్ రాజీ పడ్డారనే ఆర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెసుకు కాస్తా మేలే జరిగిందని చెప్పాలి. రాష్ట్రంలో బలాన్ని కూడగట్టుకోగలమనే ధైర్యం కాంగ్రెసు నాయకులకు వచ్చింది.
చంద్రబాబు హ్యాపీ...
రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా సభకు ప్రతిస్పందన బాగుండడం చంద్రబాబును ఆనందానికి గురి చేసిందనే చెప్పాలి. జగన్ ప్రత్యేక హోదాపై దూకుడుగా వెళ్తూ రాష్ట్రంలోని యువతను తన వైపు తిప్పుకుంటారని భావిస్తున్న తరుణంలో జగన్ మోడీతో భేటీ కావడం తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చింది. అదే సమయంలో కాంగ్రెసు ప్రత్యేక హోదాపై ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి చేసిన ప్రయత్నం కొంత మేరకు ఫలితం ఇవ్వడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. జగన్కు రావాల్సిన ఓట్లను కాంగ్రెసు ఏదో మేరకు చీల్చగలదనే నమ్మకం చంద్రబాబుకు వచ్చింది. కాంగ్రెసు ఏ మేరకు జగన్ ఓట్లను చీల్చగలిగితే ఆ మేరకు తమ పార్టీ లాభపడుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారని సమాచారం.
అదే రోజు చేసి ఉంటే...
ప్రత్యేక హోదాపై కాంగ్రెసు పార్టీ వాదనను తిప్పికొట్టడానికి కూడా చంద్రబాబుకు అవకాశం చిక్కింది. కాంగ్రెసు అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్కు ఐదేళ్లపాటు ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించిన ఆనాటి ప్రధాని మన్మోహన్సింగ్ ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ సమావేశంలో హోదాపై వచ్చిన నోట్ను తిరస్కరించారు. అంతేకాకుండా వచ్చే మంత్రివర్గ సమావేశంలో పరిశీలించాలని సూచించారు. అదే రోజు మంత్రివర్గం ఆమోదించి ఉంటే రాష్ట్రానికి తప్పకుండా ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని, ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి అదే కారణమని తెలుగుదేశం పార్టీ నాయకులు వాదిస్తున్నారు.
ప్రత్యేక హోదాను సజీవంగా...
గుంటూరు సభ ద్వారా ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెసు పార్టీ సజీవంగా ఉంచగలిగింది. ప్రత్యేక హోదా ముగిసిన అంశం కాదని స్పష్టంగానే తేల్చి చెప్పింది. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన ఉనికిని చాటుకుంది. ఈ సభకు బిసీలు ఎక్కువగా హాజరు కావడం కొంత మేరకు తెలుగుదేశం పార్టీని కలవరపరిచిన మాట వాస్తవమే. అయితే ఎక్కువగా దీనివల్ల జగన్ పార్టీ నష్టపోతుందనే అంచనాకు రాజకీయ విశ్లేషకులు వస్తున్నారు.
రాహుల్ గాంధీ స్పష్టంగా...
రాహుల్ గాంధీ గుంటూరు సభలో ప్రత్యేక హోదాపై చేసిన ప్రసంగం స్పష్టంగా ఉంది. సభకు వచ్చిన ప్రజలు ఆ ప్రసంగాన్ని చాలా శ్రద్ధగా విన్నారు. చంద్రబాబును ఆయన విమర్శించినప్పుడు స్పందన కూడా వచ్చింది. ఆయన 25 నిమిషాల పాటు ప్రసంగించారు. ప్రత్యేక హోదాపై జగన్పై ఆశలు సన్నగిల్లుతున్న నేపథ్యంలో కాంగ్రెసు లాభపడుతుందనే అంచనా ఉంది.
పవన్ కల్యాణ్ ఎలా....
ప్రత్యేక హోదాపై జనసేన అధినేత గళమెత్తుతూనే ఉన్నారు. అయితే, ఆయన వల్ల తమకు ఏ విధమైన నష్టం లేదనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన సీరియస్గా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏ విధమైన ప్రభావం వేయగలుగుతారనే అంచనా వస్తుందని భావిస్తున్నారు. పైగా, హోదాపై పవన్ కల్యాణ్ ఎక్కువగా కేంద్ర ప్రభుత్వంపై తన విమర్శను ఎక్కుపెడుతున్నారు.
సెంటిమెంట్గా మార్చే ప్రక్రియలో....
ప్రత్యేక హోదాను సెంటిమెంట్గా మార్చడంలో వైయస్ జగన్దే ప్రధాన పాత్ర. చంద్రబాబును ఎదుర్కునే క్రమంలో ఆయన ఆయన దాన్ని సెంటిమెంట్గా మార్చడానికి యువతను, విద్యార్థులను ఉద్దేశించి పలు ప్రసంగాలు చేశారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదాపై గళమెత్తడం ప్రారంభించారు. పవన్ కల్యాణ్ వల్ల జగన్ బలం తగ్గిపోయి తమకు లాభం చేకూరుతుందనే అంచనాకు తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చారు. సెంటిమెంట్గా ప్రత్యేక హోదాను మార్చిన జగన్ తాజా పరిణామాల నేపథ్యంలో దూకుడుగా వెళ్లలేని పరిస్థితి, ఒక రకంగా కేంద్రంతో రాజీ పడే ధోరణి అవలంభిస్తున్నారనే అభిప్రాయం ఉంది. దీంతో సెంటిమెంట్ను సజీవంగా ఉంచుతూ బలం పుంజుకోవాలనే ఎత్తుగడలో కాంగ్రెసు ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.