సాయికుమార్కు జగన్ పరామర్శ: అమరజీవికి నివాళి(ఫొటో)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ను సోమవారం పరామర్శించారు. సాయికుమార్ తండ్రి, సినీ నటుడు పిజె శర్మ ఆదివారం మరణించిన విషయం తెలిసిందే.
పిజె శర్మ మృతికి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సోమవారం ఆయన సాయికుమార్కు ఫోన్ చేసి ఓదార్చారు. పిజె శర్మ మణికొండలోని ఆయన నివాసంలో ఆదివారం ఉదయం తీవ్రమైన గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం ఎర్రగడ్డలోని శ్మశానవాటికలో పిజె శర్మ అంత్యక్రియలు నిర్వహించారు.
పొట్టి శ్రీరాములుకు జగన్ నివాళి
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేత విజయసాయిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.