'వీరజవాన్ ముస్తాక్ మృతిని కూడా రాజకీయం చేస్తున్న జగన్'
విజయవాడ: వీర జవాను ముస్తాక్ అహ్మద్ మరణాన్ని కూడా వైసిపి అధినేత జగన్ రాజకీయం చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మంగళవారం నాడు మండిపడ్డారు. సైనికులకు హిందూ, ముస్లీం, క్రిస్టియన్ అనే బేధాలు ఉండవనే విషయం వైయస్ జగన్ గుర్తించాలన్నారు.
ముస్తాక్ అహ్మద్ కర్వూలులో పుట్టడం మన అదృష్టమని చెప్పారు. మహా సైనికుడి మరణాన్ని రాజకీయం చేయడం జగన్కే చెల్లిందని ధ్వజమెత్తారు. ముస్తాక్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం చేశామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.
కాగా, అంతకుముందు వీరమరణం పొందిన జవాన్ ముస్తాక్ అహ్మద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు రాకపోవడం విచారకరమని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఆరోపించిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లాలోని పార్నపల్లె సైనికుడు అహ్మద్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
18 నెలల కాలంలో ఏపీకి వచ్చినన్ని నిధులు ఏ రాష్ట్రానికి రాలేదు: హరిబాబు
ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఏపీకి వచ్చినన్ని నిధులు మరే రాష్ట్రానికి కేంద్రం నుంచి రాలేదని విశాఖ ఎంపీ, ఏపీ బిజెపి అధినేత హరిబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బిజెపి చిత్తశుద్ధితో ఉందన్నారు. ఏపీ అభివృద్ధే లక్ష్యంగా కేంద్రంలోని బిజెపి పని చేస్తోందన్నారు. మార్చి 6న రాజమండ్రిలో బహిరంగ సభ జరగనుందన్నారు.
అంతకుముందు, ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి టిడిపి ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రాన్ని రూ.4 లక్షల కోట్లు అడిగితే రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. ఏపీకి కరువు సాయం చేయడంలో కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణంతో రూ.200 కోట్ల నష్టం కలుగుతోందన్నారు. ప్రభుత్వం శాశ్వత సచివాలయం నిర్మించాలని డిమాండ్ చేశారు.