4నెలల్లో సిఎం పీఠంపై: జగన్ హామీలవర్షం, భయపెట్టారు
కడప: నాలుగు నెలల్లో ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటానని రాష్ట్రాన్ని సుభిక్షంగా చేస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం అన్నారు. ఇడుపులపాయలోని ప్లీనరీలో జగన్ రెండోసారి పార్టీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ ఎన్ని కుట్రలు చేసినా మనం ఇప్పటి వరకు అదలరలేదని, బెదరలేదని అన్నారు. ఓట్లు, సీట్ల కోసం కొందరు అబద్దాలు ఆడుతున్నారని, ఏ గడ్డి అయినా తినేందుకు వెనుకాడటం లేదని విమర్శించారు.
టిడిపి, కాంగ్రెసు ఒక్కటై వైయస్సార్ కాంగ్రెసు పార్టీని లేకుండా కుట్ర చేశాయన్నారు. కోర్టులకు కూడా కలిసి వెళ్లాయన్నారు. జైలులో తనను కట్టడి చేశారన్నారు. ఇన్ని చేసినా జగన్ను, పార్టీని వెంట్రుక కూడా పీకలేకపోయారన్నారు. పదహారు నెలలు జైల్లో పెట్టి భయపెట్టారన్నారు. జగన్ను రాష్ట్రం నుండి బయటకు పంపిస్తారని, తీహార్ జైలుకు తీసుకెళ్తారని భయపెట్టారన్నారు.
ఎఫ్డిఐ ఎన్నిక సమయంలో తాము జైల్లో ఉండి కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తే, చంద్రబాబు కేసుల నుండి బయట పడేందుకు బయట ఉండి కూడా మద్దతు పలికారని విమర్శించారు. వైయస్ ఉంటే ఇప్పటికే రాష్ట్రం సువర్ణయుగం అయ్యేదన్నారు. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ చెడిపోయిందని, మనం రాజకీయాల్లో విశ్వసనీయత, నిజాయితీ అనే పదాలకు అర్థం తీసుకు రావాలన్నారు.
రెండున్నరేళ్లలో చాలా కష్టాలు పడ్డామని చెప్పారు. రాముడి రాజ్యమైతే మనం చూడలేదు కానీ వైయస్ స్వర్ణయుగం చూశామన్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు అందరు మద్దతు పలికారన్నారు. చంద్రబాబు ఏవేవో హామీలు ఇస్తున్నారని, వాటిలో చిత్తశుద్ధి అవసరమన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఆయన ఫోటో పెట్టుకోవడం విడ్డూరమన్నారు.
జగన్ హామీల చిట్టా
తాము నాలుగు నెలల్లో అధికారంలోకి వస్తామని, రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తామని జగన్ చెప్పారు. ఆయన పలు హామీలు ఇచ్చారు. నాలుగు నెలల్లో మీ మనవడు ముఖ్యమంత్రి అవుతారని, మీకు ఏడు వందల రూపాయల పింఛన్ ఇస్తాడని జగన్ వృద్దులను ఉద్దేశించి, నాలుగు నెలల్లో మీ కొడుకు సిఎం అవుతాడని మిమ్మల్ని ఆదుకుంటాడని రైతులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ప్రతి పిల్లాడిని ఇంజనీరింగి, డాక్టర్లుగా చదివిస్తానని చెప్పారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు. మీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చదివిస్తాడని చెప్పాలని విద్యార్థులకు చెప్పారు. మూడువేల కోట్లే కాదు ఆరువేల కోట్లు ఇచ్చి అయినా తాను చదివిస్తానని చెప్పారు.
ఆరోగ్యశ్రీలో ఈ ప్రభుత్వం తీసేసిన 133 రోగాలను చేరుస్తామన్నారు. ఎన్ని లక్షలు ఖర్చయినా వైద్య, విద్య, ఆరోగ్యానికి ఖర్చు పెడతామన్నారు. 108, 104ను గాడిలోకి తెస్తామన్నారు. రైతుల కోసం 101, పశువుల కోసం 102ను తీసుకొస్తామని చెప్పారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెడతామని, ఆ శాఖను చూసేందుకు ఇద్దరు మంత్రులను నియమిస్తామన్నారు.
మద్యం పైన షాక్ కొట్టిచ్చే రేట్లు ఉంటాయన్నారు. అమ్మ ఒడిని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళలు ఎప్పుడైనా డబ్బులు కట్టే వెసులుబాటు కల్పిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ముప్పై ఎంపీ స్థానాలలో గెలుపొంది.. మనమీద బతికే కేంద్రాన్ని తెచ్చుకొని రైతులకు ఎంత చేయాలో అంత చేద్దామన్నారు. వికలాంగులు, చేనేత, మత్య్యకారులకు అందరికీ అన్నలా అండగా ఉంటానన్నారు.