ఇప్పటికైనా సంతోషం: జగన్, సంక్రాంతికి ఫ్రీ: చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కొల్లేరు కాంటూరు సమస్య పరిష్కారానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం శాసన సభలో అన్నారు. కొల్లేరు కాంటూరును మూడో కాంటూరు వరకు కుదించాలని ప్రభుత్వం మంగళవారం తీర్మానం పెట్టింది.
దీనిపై జగన్ మాట్లాడారు. 2008లోనే కొల్లేరు పైన తీర్మానం జరిగిందని, కొల్లేరు కాంటూరుపై వైయస్ రాజశేఖర రెడ్డి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారని గుర్తు చేశారు. కొల్లేరు ప్రాంతవాసుల జీవనాన్ని అధ్యయనం చేసేందుకు వైయస్సార్ కమిటీని వేశారని చెప్పారు.
2008 నాటి తీర్మానాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని, రాజకీయ అవసరాల కోసం మరోసారి తీర్మానమా అని జగన్ ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజల పైన కాస్తో కూస్తో టీడీపీకి ప్రేమ వచ్చినందుకు సంతోషమన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొల్లేరు సమస్య గుర్తు లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో కట్టుకథలు చెప్పిస్తున్నారన్నారు.
సాగర్ ఆయకట్టు భూములకు నీరందించేందుకు చర్యలు: దేవినేని
నాగార్జున సాగర్ ఆయకట్టు భూములకు నీరు అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. మంగళవారం సభలో మాట్లాడుతూ సాగర్ కెనాల్పై నాసిరకం బ్రిడ్జిను నిర్మించిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈనెల 27, 28 తేదీల్లో గుంటూరు, ప్రకాశం జిల్లాలో క్షేత్రస్థాయిలో కాల్వల పరిశీలనకు అన్ని పార్టీల నేతలు రావాలని ఉమా కోరారు.
సంక్రాంతికి కానుకగా పేదలకు ఉచిత సరుకులు: చంద్రబాబు
సంక్రాంతి కానుకగా పేదలకు రూ.220 విలువైన సరుకులు ఉచితంగా అందచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసన సభలో మంగళవారం ప్రకటించారు. చౌకదుకాణాల ద్వారా పేదలకు రూ.20 కిలోల బియ్యం, కిలో గోధుమ పిండి, అరకిలో పంచధార, వందగ్రాముల నెయ్యి పంపిణీ చేస్తామన్నారు. సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఇంట్లో ఆనందాలు వెల్లువిరియాలన్నారు. టీడీపీ పేదల ప్రభుత్వమని, భవిష్యత్తులో పేదల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నారు.