రోజా శిక్ష పూర్తయింది: 'కోర్టు' స్టోరీ చెప్పిన జగన్, చంద్రబాబుకు హెచ్చరిక
తమ పార్టీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ అంశం పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు స్పందించారు.
అమరావతి: తమ పార్టీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ అంశం పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు స్పందించారు.
అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. రోజా అంశంపై రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచించాలని జగన్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన 'కోర్టు' కథ చెప్పారు.
'ఓ జడ్జి ముందుకు ఓ కేసు వస్తుంది. వీళ్లు తప్పని వాళ్లు, వాళ్లు తప్పని వీళ్లు.. ఇలా ఇరు పక్షాల వాళ్లు వాదించుకుంటారు. ఇద్దరి వాదనలు విన్న జడ్జి నిర్ణయం తీసుకుంటారు' అని జగన్ చెప్పారు.
రోజాకు అదే జరిగింది
రోజా విషయంలోను అదే జరిగిందని చెప్పారు. రోజా ఇష్యూ పైన ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత, ఓ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఆమెకు శిక్ష పూర్తయిందని చెప్పారు.
మళ్లీ శిక్ష వేస్తామంటే ఎలా?
శిక్ష పూర్తి అయిన తర్వాత కూడా గతంలో ఏదో జరిగిందని మళ్లీ శిక్ష వేస్తామంటే కరెక్టే అవుతుందా అని ప్రశ్నించారు. ఒక అంశానికి సంబంధించి ఎన్నిసార్లు చర్యలు తీసుుకంటారని ప్రశ్నించారు. ఓ ఆడకూతురు పట్ల ఇలా వ్యవహరించడం ధర్మమా అన్నారు.
మమ్మల్ని అడ్డుకుంటే..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 13కి వాయిదా పడ్డాయి. అయితే, అంతకు ముందు సభలో మాట్లాడిన వైయస్ జగన్ తమకు ఇచ్చిన సమయంలో తమను మాట్లాడనివ్వకుండా అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ తమకు అడ్డుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడే సమయంలో తాము కూడా ఆయన ప్రసంగాన్ని అడ్డుకుంటామన్నారు.
ఇది పద్ధతి కాదు
ప్రతిపక్ష పార్టీకి శాసనసభలో కేటాయించిన సమయం ముగిసినందున జగన్ ఇక మాట్లాడటం ఆపాలని స్పీకర్ సూచించిన సమయంలో జగన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సభలో ప్రతిపక్షాలను మాట్లాడకుండా అడ్డుకోవడం సరికాదని, తాము చెప్పేది అధికార పక్షం ఓపిగ్గా వినాలన్నారు.