నంద్యాల ఫలితం: జగన్ సాక్షి మీడియా ఓదార్పు విశ్లేషణ
నంద్యాలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటమికి వైయస్ జగన్ మీడియా ఓదార్పు కథనాన్ని ప్రచురించింది.ఉప ఎన్నికల్లో ఎప్పుడైనా అధికార పార్టీ విజయం సాధిస్తుందని అంటూ సాక్షి మీడియాలో రాసింది.
హైదరాబాద్: నంద్యాలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటమికి ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మీడియా ఓదార్పు కథనాన్ని ప్రచురించింది. ఉప ఎన్నికల్లో ఎప్పుడైనా అధికార పార్టీ విజయం సాధిస్తుందని అంటూ సాక్షి మీడియాలో ఓ వార్తాకథనం ప్రచురితమైంది.
దేశంలో ఇప్పటి వరకు జరగిన ఉప ఎన్నికల్లో 80 నుంచి 85 శాతం స్థానాలను ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలే గెలుచుకున్నాయని చెప్పింది. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వార్టీలకు అనుకూలంగా ఉండే యంత్రాంగం, ఇతర వ్యవస్థలు, అభివృద్ధి నినాదాలు కలిసి వస్తున్న అంశాలుగా కనిపిస్తున్నట్లు విశ్లేషించింది.
ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడిన కొద్ది కాలానికి రాజీనామాలతో ఖాళీ అవుతున్న స్థానాలకు ఎన్నికలు జరిగినప్పుడు ఆ గాలి అలాగే కొనసాగడం లేదా ప్రభుత్వాలు ఏర్పడిన కొంత కాలం తర్వాత ఎవరైనా సభ్యులు మరణించడంతో ఖాళీ అవుతున్న స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఆ సానుభూతి పవనాలు పనిచేయడం సర్వసాధారణంగా కనిపిస్తున్న పరిణామాలని వ్యాఖ్యానించింది.
భూమా నాగిరెడ్డి మరణంతో..
ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఉప ఎన్నిక అనివార్యమైందని అంటూ సానుభూతి పవనాలు పనిచేయడం వల్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి గెలిచారని చెప్పకనే చెప్పింది. భూమా బ్రహ్మానంద రెడ్డి నంద్యాలలో 27 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుత ఫలితాలపై ఇలా...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల, గోవాలోని వాల్పోయి, పానాజీ, ఢిల్లీలోని భావన (ఎస్సీ) నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా, అన్నింటిలోనూ అధికార పార్టీలే విజయం సాధించాయన సాక్షి మీడియా రాసింది. నంద్యాలలో టిడిపి, గోవాలో బిజెపి, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేసింది.
పశ్చిమ బెంగాల్లో....
ఇటీవ ఆగస్టు నెలలోనే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఏడు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో అన్ని స్థానాలను అధికార తృణమూల్ కాంగ్రెసు పార్టీ కైవసం చేసుకోవడాన్ని సాక్షి మీడియా గుర్తు చేసింది. ఈ కార్పోరేషన్లలో మొత్తం 148 వార్డులకు గాను మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెసు 140 వార్డులను గెలుచుకుందని రాసింది.
ఈ రాష్టాల్లో ఇలా...
అసోం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మధ్యప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో 2016 నవంబర్లో నాలుగు లోకసభ, 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే దాదాపు అన్ని స్థానాలు ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలే గెలుచుకున్నాయని సాక్షి మీడియా రాసింది.