ఇక వదిలేయండి: క్షమాపణ చెప్పిన జగన్
హైదరాబాద్: సభాపతి కోడెల శివప్రసాద్ పైన తాను చేసిన వ్యాఖ్యలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పశ్చాత్తాపం ప్రకటించారు. తప్పు జరిగితే అంగీకరిస్తామని, తప్పులు జరిగివుంటే బేషరతుగా క్షమాపణ చెబుతున్నామన్నారు.
సభలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హక్కుల ఉల్లంఘన నోటీసుపై చర్చ జరిగింది. అనుచితమైన మాటలు దొర్లివుంటే క్షమాపణ కోరుతున్నామని పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అన్నారు. తాను నినాదాలు చేశానని తన పేరు చేర్చారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండాలన్నది తన ఆకాంక్ష కాదన్నారు.
19న జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నానని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. స్పీకర్ స్థానంపై తమకు గౌరవముందన్నారు. జగన్ మాట్లాడుతూ.. మీ మనసు నొప్పించి ఉంటే బేషరతు క్షమాపణ చెబుతున్నానని, ఇంతటితో ఈ అంశం ముగించాలన్నారు. కుతూహలమ్మను అన్నప్పుడు చంద్రబాబు పైన అప్పుడు చర్యలు తీసుకోలేదని గుర్తుంచుకోవాలన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. స్పీకర్ను దూషించడం సాధారణమైన చర్యగా ప్రతిపక్ష నేత చెబుతున్నారని, క్షమాపణ చెబితే సరిపోతుందనుకుంటున్నారన్నారు. ఏయే సభ్యులు ఏం మాట్లాడారో వీడియో పరిశీలించాలన్నారు. వైసీపీ సభ్యుల తీరు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. కాగా, ఏపీ శాసన మండలి, శాసన సభ రేపటికి వాయిదా పడ్డాయి.