ఎప్పుడంటే అప్పుడు రూ.10వేలు: జగన్ బీసీ డిక్లరేషన్ ఇదీ! ఎవరెవరికి ఏమంటే..? సీఎం నినాదాలు
ఏలూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత ఏలూరు బీసీ గర్జనలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. బీసీలకు ఏడాదికి రూ.15వేల కోట్లు ఇస్తామని, 139 కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జనసేన బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే అభిమానులు.. సీఎం సీఎం అంటూ నినాదాలు చేసే విషయం తెలిసిందే. జగన్ సభలోను వైసీపీ కార్యకర్తలు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. తాను ప్రకటించే బీసీ డిక్లరేషన్ గతంలోని నవరత్నాలకు అదనం అన్నారు.
బాబును ఏమనకుండా చిరంజీవి వైపు వెళ్లా: గంటా, 'జగన్కు రాజకీయాలు నేర్పేందుకే వారు వైసీపీలోకి'
ఏడాదికి రూ.15వేల కోట్లు అయిదేళ్లలో రూ.75వేల కోట్లు
చంద్రబాబు సొంతగా పథకాలు కూడా అమలు చేయడం లేదని జగన్ అన్నారు. జగన్ చెప్పాడా.. మనమూ చేద్దాం అన్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు. పద్నాలుగేళ్లకు పైగా సీఎంగా ఉన్న వ్యక్తి తన పథకాలను కాపీ చేస్తున్నాడని, సిగ్గులేకుండా కాపీ చేస్తున్నాడని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు బీసీలకు ఖర్చు చేసింది కేవలం రూ.3వేల కోట్లేనని, తాము అధికారంలోకి వస్తే ఏడాదికి రూ.15వేలు ఖర్చు చేస్తామని, అయిదేళ్లకు రూ.75వేలు ఖర్చు చేస్తామన్నారు. అయిదేళ్లలో రూ.60 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా, కేవలం రూ.18వేల కోట్లు కేటాయించారన్నారు. అన్ని కులాలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. 139 కార్పోరేషన్లు పెడతామని చెప్పారు. కార్పోరేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని తెలిపారు.
45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.75వేలు
ఉన్నత చదువులతోనే పేదరికాన్ని జయించగలమని, అందుకే పిల్లల చదువుకు ఎంత ఖర్చయినా భరిస్తామని జగన్ చెప్పారు. నిర్లక్ష్యానికి గురయ్యామనే బాధ ఏ కులం వాళ్లకు లేకుండా చూస్తామని చెప్పారు. వైయస్సార్ చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.75వేలు ఇస్తామని చెప్పారు. శాశ్వత ప్రాతిపదికిన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కులం సర్టిఫికేట్ కోసం కాళ్లు అరిగేలా తిరగవలసి వస్తుందని, అలా లేకుండా చూస్తామని అన్నారు. మూడో వంతు నిధులు బీసీలకు కేటాయిస్తామని చెప్పారు.
ఎప్పుడు అవసరమైతే అప్పుడు రూ.10వేలు సున్నా వడ్డీకి
చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికి ఐడీ కార్డు (గుర్తింపు కార్డ్) ఇస్తానని జగన్ చెప్పారు. అంతేకాకుండా, ఇలాంటి వారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు సున్నా వడ్డీకే రూ.10వేలు ఇస్తానని చెప్పారు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలకు నామినేటెడ్ కమిటీల్లో యాభై శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వచ్చేలా చట్టం తెస్తామన్నారు. అందుకు అనుగుణంగా చట్టం తీసుకు వస్తామని చెప్పారు. సమగ్ర సబ్ ప్లాన్ చట్టాన్ని చట్టబద్దంగా తీసుకు వస్తామన్నారు. షాప్ ఉన్న ప్రతి నాయీ బ్రాహ్మణుడికి రూ.10వేలు ఇస్తానని చెప్పారు. మత్స్యకారులకు ఏడాదికి రూ.10వేలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. మగ్గం ఉంటే నెలకు రూ.2వేలు ఇస్తామన్నారు. సహకార సంఘాల్లో పాలు పోస్తే ప్రతి లీడర్కు రూ.4 అదనంగా ఇస్తామని చెప్పారు. గొర్రెలు, బర్రెలు చనిపోతే యాదవులకు రూ.6వేలు ఇస్తామన్నారు. గ్రామ వాలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వైసీపీ చేయూత డబ్బును ఇస్తారని చెప్పారు. లాభాలు వచ్చే రూట్లలో చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను తిప్పడం లేదని, చంద్రబాబు మనుషులైన కేశినేని, జేసీ ట్రావెల్స్ వంటి ట్రావెల్ బస్సులు మాత్రమే ఈ రూట్లలో తిప్పుతున్నారని విమర్శించారు. ప్రముఖ ఆలయాల్లో పారిశుద్ధ్యం కాంట్రాక్ట్ చంద్రబాబు బంధువుకు ఇచ్చారని విమర్శించారు.