బీజేపీ కనీసం తప్పు తెలుసుకుంది, ఓటుకు నోటు నుంచి.. బాబు సిగ్గులేకుండా: కర్ణాటకపై జగన్
అమరావతి: కర్ణాటక ఎపిసోడ్పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. కర్ణాటక ఎపిసోడ్ ముగిసిందని, రాజ్యాంగం వెలిగిందని ఈ మేరకు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.
చదవండి: ఇక చాలు, రాజీనామా చేయండి!: యడ్యూరప్ప తీరుపై అధిష్టానం ఆగ్రహం? రంగంలోకి బీజేపీ పెద్దలు
అయితే, అంతకంటే ఘోరంగా గత నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయని వాపోయారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని కర్ణాటకలో బీజేపీపై ఆరోపణలు వస్తే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్నారు.
చదవండి: ప్రధాని ఇలా చేస్తే ఎలా, గాలిని రంగంలోకి దించారు: యడ్యూరప్ప రాజీనామాపై చంద్రబాబు
23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేశారు
చంద్రబాబు గారు ఏపీలో ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేశారని జగన్ మండిపడ్డారు. తద్వారా తాను ఎంతటి అప్రజాస్వామికవాదినో నిరూపించారని ఎద్దేవా చేశారు. అందులో నలుగురిని మంత్రులుగా కూడా చేసి రాజ్యాంగాన్ని ఖూని చేశారన్నారు.
ఓటుకు నోటు నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు దాకా
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిరోదక చట్టం కింద చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించినా చర్యలు లేవని జగన్ అన్నారు. తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేను నల్లధనంతో కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఇప్పుడు కర్ణాటక అంశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు అంటూ మాట్లాడటం సిగ్గుచేటు అని ఓటుకు నోటు కేసును ఉద్దేశించి అన్నారు.
కనీసం బీజేపీ వెనుకడుగు వేసింది
ఓటుకు నోటు కేసుతో సంబంధం ఉన్న, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను అక్రమంగా టీడీపీలో చేర్చుకొన్న చంద్రబాబుకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఎలా అని జగన్ అభిప్రాయపడ్డారు. కనీసం కర్ణాటకలో తాము చేసింది తప్పు అని తెలిసి, అల్లరి అవుతుందని భావించి బీజేపీ వెనుకడుగు వేసిందని గుర్తు చేశారు.
చంద్రబాబు నిస్సిగ్గుగా ముందడుగు వేశారు
కానీ, చంద్రబాబు మాత్రం తప్పని తెలిసినా, అల్లరి అవుతుందని అర్థమైనా నిస్సిగ్గుగా ముందడుగు వేశారని జగన్ మండిపడ్డారు. కర్ణాటక ఎపిసోడ్ తర్వాత ఇప్పటికైనా ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ నిపుణులు, మీడియా దృష్టి పెట్టాల్సిన అంశం ఇదే అన్నారు.
చంద్రబాబు ఏమన్నారంటే
కాగా, అంతకుముందు చంద్రబాబు కర్ణాటక ఇష్యూపై స్పందించారు. యడ్యూరప్ప రాజీనామా చేయడం ప్రజాస్వామ్యం సాధించిన విజయమని, తాజా పరిణామంతో దేశం మొత్తం ఆనందం వ్యక్తం చేస్తోందని, ఒక్కరోజులో బలాన్ని నిరూపించుకోవాలన్న సుప్రీం ఆదేశంతో బీజేపీ బెంబేలెత్తిపోయారని, సుప్రీం తీర్పు వల్లే ప్రజాస్వామ్యం గెలిచిందని, సాక్షాత్తు ప్రధాని, అమిత్ షా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే స్థాయికి చేరుకున్నారని, అధికారంలోకి రాకముందు నిజాయితీగా ఉంటానంటూ ప్రకటనలిచ్చిన మోడీ.. ఖనిజ సంపదను దోచుకున్న వ్యక్తిని రంగంలోకి దింపారని, ఇక ప్రజాసేవ ఏం చేస్తారని, దేశ యువతకు ఎలాంటి సందేశం ఇస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. అయితే, అమరావతి నుంచి పోలవరం దాకా అవినీతికి పాల్పడుతోన్న చంద్రబాబు ప్రభుత్వం, ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్సీని కొనుగోలు చేసే ప్రయత్నం చేసిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని, మంత్రి పదవులు ఇచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని విపక్షాలు అంటున్నాయి.