బాబు యూటర్న్, ఇవి ఎక్కడ?: అమిత్ షా జగన్ ఆశ్చర్యం, 'పవన్! నువ్వు అక్కడ లేవుగా'
అమరావతి: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రాసిన లేఖపో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లేఖలోని అంశాలు ఆశ్చర్యకరమని, ప్యాకేజీ హోదాకు ఎలా సమానమవుతుందని అన్నారు. అమిత్ షా లేఖపై ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
చదవండి: తప్పంతా మీదే, ఎంతో చేశాం: చంద్రబాబుకు అమిత్ షా లేఖ
అమిత్ షా లేఖలో అన్నీ అవాస్తవాలే అని చంద్రబాబు అన్నారు. బీజేపీ హోదా ఇవ్వదని, టీడీపీ సాధించదని, హోదాతోనే ఏపీకి న్యాయం జరుగుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి.. అమిత్ షా లేఖపై స్పందించారు. ప్యాకేజీని చంద్రబాబు ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకొని, రెండేళ్ల తర్వాత యూటర్న్ తీసుకుందని మండిపడ్డారు. 23 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని రూ.20 కోట్లు, రూ.30 కోట్లు ఇచ్చి అడ్డగోలుగా కొనుగోలు చేశారని చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు.
చదవండి: ఎప్పుడో రంగంలోకి దిగారు!: మురళీ మోహన్ రాజకీయ వారసులు ఆమెనా?
ఆశ్చర్యం కలిగిస్తున్నాయి
షా రాసిన లేఖలోని అంశాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని, హోదా ద్వారా రాష్ట్రాలకు ఇచ్చే పారిశ్రామిక రాయితీలు ఇవ్వకుండా రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని జగన్ నిలదీశారు. రాష్ట్ర అప్పులు గత నాలుగేళ్లలో రూ.97 వేల కోట్ల నుంచి రూ.2.25 లక్షల కోట్లకు చేరిందన్నారు. దీనిని పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్యాకేజీ హోదాకు సమానమని ఎలా చెబుతారన్నారు.
ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి
హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చే పారిశ్రామిక రాయితీలు, జీఎస్టీ, వంద శాతం ఆదాయపు పన్ను మినహాయింపులు, కరెంటు ఛార్జీల్లో రిబేటు తదితర ప్రయోజనాలు ప్రత్యేక ప్యాకేజీలో ఎక్కడున్నాయని జగన్ అన్నారు. ఈ ప్రయోజనాలు లేకుండా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్తో ఎలా పోటీ పడతామన్నారు.
కేంద్రం ఎందుకు పక్కకు మళ్లింది, రెండేళ్ల తర్వాత బాబు
ప్రత్యేకహోదా నుంచి కేంద్రం ఎందుకు పక్కకు మళ్లిందని జగన్ ప్రశ్నించారు. పెరిగిన అప్పులు, ప్రత్యేక పారిశ్రామిక రాయితీలను దృష్టిలో పెట్టుకోకుండా సీఎం చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకోవడం ఏమిటని నిలదీశారు. రెండేళ్ల తర్వాత చంద్రబాబు హోదా అంటూ యూటర్న్ తీసుకున్నారన్నారు. ప్రత్యేక రాయితీలు లేకపోతే ఐటీ హబ్, పరిశ్రమ, ఆసుపత్రులు ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలను కాదని ఏపీకి ఎవరు వస్తారన్నారు.
హోదాపై హామీ ఇచ్చారు
పార్లమెంటు సాక్షిగా హోదా ఇస్తామని చెప్పి రాష్ట్రాన్ని విభజించారని జగన్ అన్నారు. 2014 ఎన్నికల సమయంలో తిరుపతిలో నరేంద్ర మోడీ హోదాపై హామీ ఇచ్చారన్నారు. ఇదే అంశాన్ని టీడీపీ, బీజేపీ అజెండాలో కూడా పెట్టారని, ఇప్పుడు ఏపీకి ఎంతో చేశామని బీజేపీ, ఏమీ చేయలేదని చంద్రబాబు అంటున్నారని మండిపడ్డారు. ఈ చర్చల కన్నా హోదా ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ బతుకుతుందన్నారు.
అమిత్ షాపై మహేష్ కత్తి ట్వీట్
అమిత్ షా లేఖపై మహేష్ కత్తి ట్వీట్ చేశారు. అమిత్ షా ప్రభుత్వానికి సంబంధించి ఒక రాజ్యాంగేతర శక్తి అని, పార్టీ అధ్యక్షుడు కావొచ్చునని, అది పార్టీ వరకే ఉండాలని, ప్రభుత్వాలను ఓపెన్గా శాసించి, రాష్ట్ర ప్రభుత్వాలను అఫిషియల్గా ప్రశ్నించే అధికారం లేదని, బీజేపీకి రాజ్యాంగం, పార్లమెంటు, ప్రజాస్వామ్యంపై గౌరవం లేదనడానికి ఇది ఉదాహరణ అన్నారు.
పవన్ కళ్యాణ్కు కత్తి మహేష్ ప్రశ్న
జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కూడా కత్తి మహేష్ ప్రశ్న సంధించారు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష ఏమయిందని, ఇంకా వామపక్షాలతో చర్చలేమిటని, ప్రజలు ఇప్పటికే రోడ్లపైకి వచ్చారని, విశాఖ లేదా విజయవాడ గుర్తుకు లేదా, ఢిల్లీ నిరసనలు మరిచిపోయావా, మొన్న జరిగిన హైవే రోకోలో పవన్ లేరుగా అని ట్వీట్ చేశారు.