సీసీ కెమెరాలు పని చేయలేదు: విశాఖ కత్తి దాడిపై తొలిసారి జగన్, సంచలన వ్యాఖ్యలు
పార్వతీపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై విశాఖపట్నంలో కత్తితో దాడి జరిగిన అనంతరం ఇటీవలే తన ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించారు. దాడి అనంతరం తొలిసారి ఆ ఘటనపై స్పందించారు.
పార్వతీపురంలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ తొలిసారి ఈ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయంగా ఎదగడం కోసం ప్రతిపక్ష నేతను తొలగించేందుకు కూడా వెనుకాడని వ్యక్తి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు అవినీతిని ప్రశ్నించినందుకు తనను మట్టుబెట్టేందుకు ప్రయత్నించారన్నారు.
ఆపరేషన్ గరుడను అందుకే తెరపైకి తెచ్చారు
విశాఖ విమానాశ్రయంలో తనపై హత్యాయత్నం చంద్రబాబు కుట్రలో భాగం కాదా అని జగన్ ప్రశ్నించారు. గత ఏడాది నవంబర్ 6న ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైందని, మార్చి నాటికి మహోన్నతరూపం దాల్చిందని, దీంతో నారాసురుల పాలన అంతమవుతుందన్న సంకేతాలు వస్తున్న సమయంలో తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. అందుకే ఆపరేషన్ గరుడును చంద్రబాబు తెరపైకి తెచ్చారన్నారు.
ఇలా కుట్ర చేశారు
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన శివాజీని తెరపైకి తెచ్చారని జగన్ అన్నారు. ఆ సినీ నటుడికి ఎల్లో మీడియాను జత కలిపారని చెప్పారు. అతనితో ప్రెస్ మీట్లు పెట్టించి ఎల్లో మీడియాలో విపరీతంగా ప్రచారం చేయించారని ధ్వజమెత్తారు. ఆ సినీయాక్టర్ చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును చదివారన్నారు. ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుందని రాష్ట్రం అతలాకుతలం అవుతుందని చదివించారని, కత్తి దాడిలో ప్రతిపక్ష నేత చనిపోతే ఎయిర్ పోర్టు భద్రత రాష్ట్ర పరిధిలోకి రాదని చెప్పి తప్పించుకోవచ్చునని, ఒకవేళ కుట్ర వవిఫలమైతే ఆపరేషన్ గరుడలో భాగమని చెప్పేందుకు ప్లాన్ చేసుకున్నారని ఆరోపించారు.
చంద్రబాబు చెప్పాలి
ఎయిర్ పోర్టులో రెస్టారెంటు ఓనర్ హర్షవర్ధన్ చౌదరి ముఖ్యమంత్రికి సన్నిహితుడు అని జగన్ చెప్పారు. కత్తులు తీసుకొని వీఐపీ లాంజ్లోకి వస్తే కుట్రగా అనిపించడం లేదా చంద్రబాబూ అని ప్రశ్నించారు. నాపై హత్యాయత్నం జరిగిన గంటకు ముందే చంద్రబాబు స్క్రిప్టును చదివేందుకు డీజీపీ, మంత్రులు ముందుకు వచ్చారని చెప్పారు. హత్యాయత్నం చేసిన వ్యక్తి జగన్ మనిషి అని తప్పుడు ప్రకటనలు చేశారని చెప్పారు. ఆ వ్యక్తి నా అభిమాని అయితే చంపాలని ఎలా అనుకుంటాడో చంద్రబాబు చెప్పాలన్నారు.
లేఖపై ప్రశ్నల వర్షం
హత్యాయత్నం చేసిన వ్యక్తి జగన్ అభిమాని అని ఫ్లెక్సీని విడుదల చేశారని జగన్ అన్నారు. ఫ్లెక్సీ పైభాగంలో తన అమ్మ, నాన్న, చెల్లి ఫోటోలు ఉండవని, ఆ ప్లెక్సీలో గరుడ పక్షి మాత్రం కనిపించడం విడ్డూరమన్నారు. నాపై హత్యయత్నం జరిగినప్పుడు ఎయిర్ పోర్టు అధికారులు ఆ వ్యక్తిని పట్టుకొని జేబులో ఏమైనా ఉన్నాయా అని వెతికారని, అప్పుడు మాత్రం ఎలాంటి లేఖలు దొరకలేదన్నారు. కానీ హత్యాయత్నం జరిగిన గంటలోపు డీజీపీ వచ్చి లేఖ దొరికిందని చెబుతారని, అది ఇస్త్రీ చేసినట్లుగా ఉందన్నారు. ఆ లేఖను రాత్రి 10 గంటలు దాటిన తర్వాత విడుదల చేశారన్నారు. లేఖలో రెండు మూడు చేతి రాతలు ఉన్నాయన్నారు. మడత కూడా మలగలేదన్నారు. చంద్రబాబుకు ఇవన్నీ కుట్రలుగా కనిపించలేదా అన్నారు.
సీసీ కెమెరాలు పని చేయలేదు, కత్తికి విషం ఉందనే అనుమానంతో
విశాఖపట్నం జిల్లాలో తాను అడుగుపెట్టినప్పటి నుంచే ఎయిర్ పోర్టులో సీసీ కెమెరాలు ఆగిపోయాయని జగన్ చెప్పారు. హత్యాయత్నం జరిగిన వెంటనే నేను ఎవరి మీద అభాండాలు వేయలేదని చెప్పారు. రక్తంతో తడిచిన నా చొక్కును మార్చుకున్నానని, అక్కడి నుంచి విమానం ఎక్కేటప్పుడు నాకు ఏమీ కాలేదని ఒక ట్వీట్ చేయమని చెప్పనని, ఆ కత్తిలో ఏమైనా విషం ఉందేమోనని, మెరుగైన ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వెళ్లానని చెప్పారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లానని, చంద్రబాబు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి జగన్ ఆసుపత్రికి వెళ్లకుండా ఇంటికి వెళ్లాడని ఆరోపించారన్నారు. అంతేకాదు బీజేపీ నేతలు తనతో మాట్లాడాకే ఆసుపత్రికి వెళ్లానని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. తన పక్కనున్న సెక్యూరిటీ రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. నేను ఇంటికి వెళ్లానో ఆసుపత్రికి వెళ్లానో మీకు తెలియదా అన్నారు. కుట్రను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు వెకిలి నవ్వు నవ్వారని చెప్పారు. ఇలాంటి చంద్రబాబుతో దర్యాఫ్తు చేయిస్తే న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. హత్యాయత్నం చంద్రబాబు చేయించకపోతే స్వతంత్ర దర్యాఫ్తుకు ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించారు. ఓదార్పు కోసం నేను కాంగ్రెస్ పార్టీతో విభేదిస్తే సిగ్గులేకుండా కాంగ్రెస్తో చంద్రబాబు కలిసి సీబీఐ విచారణ చేయించారని, ఆ రోజు నీకు సీబీఐ ముద్దు, ఇప్పుడు వద్దా అని నిలదీశారు.
సీబీఐపై జీవోలు అందుకే
రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా జీవోలు జారీ చేశారని, తనపై హత్యాయత్నం, అవినీతి, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, వీటిపై విచారణ జరిగితే జైలుకు పోతాననే భయంతో వణికిపోతున్నారని జగన్ అన్నారు. నువ్వెన్ని కుట్రలు పన్నినా నా సంకల్పం సడలిపోదని, నా ఒంట్లో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడుతానని చెప్పారు.