చేసేదే చెప్తా, తప్పుడు వాగ్ధానాలివ్వను : కాపు రిజర్వేషన్లపై తేల్చేసిన వైయస్ జగన్
రాజమహేంద్రవరం: కాపులకు రిజర్వేషన్లు అమలుచేయలేమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. 222వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం తూర్పు గోదావరి జిలా జగ్గంపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగించారు.
కాపు రిజర్వేషన్లపై ప్రకటన చేయాలని తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో కొందరు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ అంశం రాష్ట్ర పరిధిలో లేదని జగన్వారిని ఉద్దేశించి చెప్పారు.
ఆ హామీలు ఇవ్వలేను
రిజర్వేషన్లు 50శాతం దాటరాదని సుప్రీంకోర్టు తీర్పు ఉందని జగన్ గుర్తు చేశారు. రిజర్వేషన్లకు సంబంధించిన అంశం రాష్ట్రం పరిధిలో లేదని, అది సాధ్యం కాదు కాబట్టే తాను అమలు కాని హామీలు ఇవ్వబోనని జగన్ అన్నారు.
బాబు కంటే రెట్టింపు నిధులు
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని అంశం కాబట్టే తాను చేయలేనని చెబుతున్నానన్నారు. కాపు కార్పొరేషన్కు ఏడాదికి రూ.1000 కోట్లు ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారనీ.. ఆయన కేటాయించిన దానికంటే రెట్టింపు నిధులు కేటాయిస్తానని జగన్ తెలిపారు.
నాలుగేళ్ల అవినీతి పాలన
కాగా, నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, అరాచాకాలు చేస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనను చూస్తే ప్రజలు భయపడుతున్నారని, జన్మభూమి కమిటీలతో మాఫీయా గుండాలకు తయారు చేస్తున్నారని జగన్ విమర్శించారు.
సంతలో పశువుల్లా..
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యేను సంతలో పశువును కొన్నట్లు కొన్నారని అన్నారు. ఇసుక, మట్టిని దేనిని వదలకుండా 20నుంచి 30 కోట్లుకు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు అభివృద్ధిని చూసి పార్టీ మారుతున్నామని చెప్పారని, నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో ఏం అభివృద్ధి సాధించారో చెప్పాలని జగన్ నిలదీశారు.