వైఎస్ కొండారెడ్డి అరెస్ట్-బీజేపీ కాంట్రాక్టర్ ను బెదిరించి-జగన్ ఆగ్రహానికి గురై...
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యాపారాలు,కాంట్రాక్టర్లపై బెదిరింపులు ఎక్కువైనట్లు విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో సీఎం సొంత జిల్లా కడపలో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. స్వయంగా సీఎం జగన్ కుటుంబానికి దగ్గర బంధువైన వైఎస్ కొండారెడ్డిని పోలీసులు ఓ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారంలో అరెస్టు చేశారు. దీని వెనుక చాలా కథే జరిగింది.
వైఎస్ కుటుంబానికి బంధువైన వైఎస్ కొండారెడ్డి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం పరిధిలోకి వచ్చే చక్రాయపేట
మండలం వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. గతంలో వైఎస్ జగన్ పాదయాత్రలో కూడా పాల్గొన్న ఆయన కొంతకాలంగా చక్రాయపేటలో వైసీపీ వ్యవహారాలు చూస్తున్నారు. ఇదే క్రమంలో పులివెందుల-రాయచోటి రహదారి పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డు కాంట్రాక్టు తీసుకున్న కర్నాటక లోని ఎస్ ఆర్ కే కన్ స్ట్రక్షన్స్ సంస్ధ పనులు చేపట్టింది. ఇది కర్నాటకలోని ఓ బీజేపీ నేతకు చెందిన సంస్ధగా చెప్తున్నారు. ఈ సంస్ధ రోడ్డు పనులు చేస్తున్న సమయంలో చక్రాయపేటలో పనులు జరగాలంటే డబ్బులివ్వాలని వైఎస్ కొండారెడ్డి సదరు కాంట్రాక్టర్ ను బెదిరించారు.

వైఎస్ కొండారెడ్డి బెదిరింపులపై కాంట్రాక్టర్ అయిన సదరు బీజేపీ నేత సీఎం జగన్ ను నేరుగా ఆశ్రయించినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్.. చర్యలు తీసుకోవాలని స్ధానిక పోలీసుల్ని ఆదేశించారు. దీంతో కడప పోలీసులు ఇవాళ కొండారెడ్డిని అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొండారెడ్డి కాల్ డేటా పరిశీలించిన పోలీసులకు అతను సదరు కాంట్రాక్టర్ ను బ్లాక్ మెయిలింగ్ చేసినట్లు నిర్ధారించారు. దీంతో ఆయన్ను స్ధానిక కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు పంపారు. కొండారెడ్డిని కడప జైలుకు తరలించారు.
సీఎం సొంత జిల్లాలో, అదీ సొంత నియోజకవర్గమైన పులివెందులలో చోటు చేసుకున్న ఈ ఘటన స్ధానికంగా కలకలం రేపింది. ఇప్పటికే బాబాయ్ హత్య కేసు కూడా జిల్లాలోనే జరగడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.