వైయస్ ఇచ్చినంత డబ్బే ఇస్తారా, ఎలా సరిపోతుంది: బాబుకు జగన్ హెచ్చరిక
ఆరోగ్యశ్రీ పైన సీఎం చంద్రబాబు తన తీరు మార్చుకోవాలని జగన్ హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి కలెక్టరేట్ల వద్ద నిరసన తెలుపుతోంది.
ఒంగోలు: ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆందోళన తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తన తీరు మార్చుకోవాలని జగన్ హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి కలెక్టరేట్ల వద్ద నిరసన తెలుపుతోంది.
వైయస్ హయాంలో..
తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ పేదవాడికైనా అనారోగ్యంగా ఉంటే 108కి ఫోన్ చేస్తే, వెంటనే కుయ్ కుయ్ మంటూ వచ్చేదని, ఇప్పుడు మాత్రం అలా రావడం లేదన్నారు. వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితిని చంద్రబాబు కల్పించారని మండిపడ్డారు. చదివించడం కోసం కూడా అప్పులపాలయ్యే పరిస్థితి ఉందన్నారు.
ఆరోగ్యశ్రీకి చంద్రబాబు తూట్లు
ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంట్సుకు చంద్రబాబు తూట్లు పొడిచారన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు.. జాబు రావాలంటే చంద్రబాబు రావాలని పెద్ద ఎత్తున ప్రచారం చేశారన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాక ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారన్నారు.
ఎవరైనా పేదవాడు ఆరోగ్యశ్రీతో వైద్యం
చేయించుకోవాలనుకుంటే ఈ ప్రభుత్వం హయాంలో కుదరడం లేదన్నారు. ఎవరికైనా డయాలసిస్ కావాలంటే వారానికి ఆరువేలు, సంవత్సరానికి మూడు లక్షలకు పైగా ఖర్చు అవుతుందన్నారు. పేదవాడు అంత మొత్తం ఎలా భరించగలడన్నారు. ఇక, క్యాన్సర్ వస్తే కీమో థెరపీ చేయాలన్నారు. బాధితుడుకి ఒక్కోసారి ఏడెనిమిది సార్లు కీమో థెరపీ చేయాలని, ఒక్కసారికే లక్ష రూపాయలు ఖర్చవుతుందన్నారు. చంద్రబాబు మాత్రం దీనికి మొత్తంగా కేవలం రూ.2 లక్షలే ఇస్తున్నారన్నారు. ఇది ఎలా సరిపోతుందన్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ అంటే ఒకటి రెండేళ్లు ఎదురు చూడవలసి వస్తోందన్నారు.
వైయస్ ఇచ్చినంతేనే.. ఏ గడ్డి పెడితో చంద్రబాబుకు బుద్ధి వస్తుంది
పేదలకు కార్పోరేట్ వైద్యాన్ని చంద్రబాబు అందని ద్రాక్షగా మార్చేశారని మండిపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి పెట్టినప్పుడు.. అంటే పదేళ్ల క్రితం ఆరోగ్యశ్రీకి ఎంతిచ్చారో, ఇప్పుడు అంతే ఇస్తే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. అన్ని రేట్లు పెరిగాయని, ఆరోగ్యశ్రీకి ఇచ్చే నిధులు ఎందుకు పెంచడం లేదో చెప్పాలన్నారు. ఏ గడ్డి పెడితే చంద్రబాబుకు బుద్ధి వస్తుందన్నారు. ఆరోగ్యశ్రీ తీరును నిరసిస్తూ ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నామని చెప్పారు. ఇది వరకు ఆరోగ్య శ్రీ కోసం 1200 మంది అప్లికేషన్ పెడితే, సాయం చేయకపోవడంతో పన్నెండు మంది కూడా దరఖాస్తు పెట్టడం లేదన్నారు.
చంద్రబాబును హెచ్చరిస్తున్నా
చంద్రబాబును హెచ్చరిస్తున్నామని, చంద్రబాబును గట్టిగా అడుగుతున్నామని, ఆరోగ్యశ్రీని వెంటనే మంచిగా అమలు చేయాలన్నారు. చంద్రబాబుకు బుద్ధి వచ్చే వరకు నిరసనలు తెలుపుతామని చెప్పారు. దీనిపై అన్ని రకాలుగా పోరాటానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. చంద్రబాబు మనసు మారకుంటే మరింత ఉద్యమిస్తామన్నారు.
చంద్రబాబుకు అల్టిమేటం
చంద్రబాబుకు బుద్ధి ఉండాలి, వెళ్లిపోయిన ఆ కలెక్టర్కు బుద్ధి ఉండాలని ఓ సందర్భంలో అన్నారు. ఆరోగ్య శ్రీ విషయంలో చంద్రబాబు తీరు మారకుంటే ఇంకా తీవ్రంగా పోరాటం చేస్తామని, చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీని మామూలుగా నడిపించాలన్నా ఏడాదికి రూ.910 కోట్లు కావాలని, కానీ చంద్రబాబు రూ.560 కోట్లే ఇస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీ నుంచి 133 రోగాలను తీసివేశారన్నారు.