జగన్ గృహసారధులు ప్లాన్ వెనుక ? యూపీ, గుజరాత్ లో బీజేపీ సక్సెస్ మంత్ర ! ఏపీలో పనిచేస్తుందా ?
ఏపీలో వచ్చే ఎన్నికల్లో మరోసారి ఘనవిజయం కోసం వ్యూహరచన చేస్తున్న వైఎస్ జగన్ తాజాగా గృహసారధుల నియామకంపై ప్రకటన చేశారు. ప్రతీ 50 ఇళ్లకు ముగ్గురు గృహసారధుల చొప్పున మొత్తం 5.2 లక్షల మందిని నియమించాలని నిర్ణయించారు. క్షేత్రస్ధాయిలో ఓటర్ల మేనేజ్ మెంట్ కోసం ఇప్పుడున్న వాలంటీర్ల వ్యవస్ధ సరిపోదని భావించడం వల్లే ఈ గృహసారధుల ప్లాన్ అమలు చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ ప్లాన్ ను ఇప్పటికే బీజేపీ యూపీ, గుజరాత్ లో అమలు చేసి వరుస విజయాలు అందుకుంది.
జగన్ గృహసారథుల ప్లాన్
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తోంది. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎట్టిపరిస్ధితుల్లోనూ గెలవాలని భావిస్తున్న జగన్.. వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇందుకోసం ఎన్ని వ్యయ ప్రయాసలకైనా సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా తెరపైకి వచ్చిందే గృహసారథుల ప్లాన్. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న వాలంటీర్ల వ్యవస్ధను కాదని వైసీపీ తరఫున రెట్టింపు సైన్యంతో గృహసారథుల ప్లాన్ ను జగన్ సిద్దం చేసుకుంటున్నారు. తద్వారా క్షేత్రస్ధాయిలో ఓటర్ల మేనేజ్ మెంట్ వ్యూహాలకు మరింత పదునుపెడుతున్నారు. త్వరలో 5.2 లక్షల మంది వాలంటీర్లతో పాటు 45 వేల మంది వరకూ కన్వీనర్లను కూడా నియమించబోతున్నారు.
బీజేపీ పన్నాప్రముఖ్ ప్లాన్ తరహాలోనే
బీజేపీ ఇప్పటికే యూపీ, గుజరాత్ వంటి పలు రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న పన్నా ప్రముఖ్ ప్లాన్ తరహాలోనే ఈ గృహసారథుల ప్లాన్ రూపుదిద్దుకుంటోంది. పన్నా ప్రముఖ్ ప్లాన్ బీజేపీకి అందిస్తున్న ఫలితాలతో జగన్ కన్ను కూడా దీనిపై పడినట్లు తెలుస్తోంది. ఏపీలో కురుక్షేత్రాన్ని తలపించేలా జరగబోతున్న వచ్చే ఎన్నికలకు ప్రస్తుతం ఉన్న వాలంటీర్ల వ్యవస్ధ ఏమాత్రం సరిపోయేలా లేదు. దీంతో ఓటర్లను మేనేజ్ చేసేందుకు మరో కొత్త వ్యవస్ధ అవసరం ఏర్పడింది. దీంతో జగన్ ఈ గృహసారధుల్ని రంగంలోకి దింపుతున్నారు.
గుజరాత్, యూపీలో సక్సెస్ ఫార్ములా
ఇప్పటికే యూపీతో పాటు తాజాగా జరిగిన గుజరాత్ ఎన్నికల్లోనూ బీజేపీ ఘనవిజయాల వెనుక ఉన్న వ్యూహం పన్నా ప్రముఖ్. ఈ వ్యూహంతోనే బీజేపీ పలు రాష్ట్రాల్లో వరుస విజయాలు అందుకుంటోంది. బీజేపీ కార్యకర్తలే కాదు అందరు ఓటర్లను తమవైపు తిప్పుకునే లక్ష్యంతో బీజేపీ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంది. అందుకే ఇప్పుడు బీజేపీకి ఎప్పుడూ ఓటు వేయని మైనార్టీలు సైతం ఆ పార్టీవైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో విపక్షాలు సహజంగానే కకావికలు అవుతున్నాయి. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17 స్దానాలకు పరిమితం కావడం వెనుక మోడీ-షాలు అమలు చేసిన ఈ పన్నా ప్రముఖ్ వ్యూహమే ఇప్పుడు జగన్ కు పనికొస్తోంది.
ఏంటీ పన్నా ప్రముఖ్ ?
పన్నా ప్రముఖ్ వ్యూహాన్ని ఓటర్లను సూక్షస్ధాయిలో మేనేజ్ చేసేందుకు వ్యూహకర్తలు తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా క్షేత్రస్ధాయిలో ఓటర్లను భారీ ఎత్తున మేనేజ్ చేసేందుకు ఈ పన్నా ప్రముఖ్ లు పనిచేస్తారు. నిత్యం ఓటర్లతో మమేకమై వారి అవసరాల్ని తెలుసుకుంటారు. ప్రభుత్వ పథకాలు, సొంత అవసరాలు, ప్రభుత్వంలో వ్యక్తిగత పనులు.. ఇలా ఓటర్లకు ఏం కావాలో తెలుసుకుని వాటిన సాధ్యమైనంతగా పూర్తి చేసేందుకు వీరు ప్రయత్నిస్తారు. వీరికి ఎలాగో ప్రభుత్వ అండదండలు ఉంటాయి కాబట్టి ఇవేవీ అసాధ్యం కాదు. వీరి అంతిమ లక్ష్యం ఓటర్లను పోలింగ్ రోజు బూత్ లకు రప్పించి తమకు అనుకూలంగా ఓటు వేయించుకోవడమే.
జగన్ చేతిలో పాశుపతాస్త్రం ?
గుజరాత్, యూపీ వంటి రాష్ట్రాల్లో బీజేపీ పన్నా ప్రముఖ్ వ్యూహంతో భారీ ఎత్తున వాలంటీర్లను నియమించుకోవడమే కాకుండా వారిని కంటికి రెప్పలా కాపాడుకుంది. అంతే కాదు వీరు కోరిన విధంగా పనులు చేసి పెడుతూ ఓటర్లను ఆకట్టుకుంది. ఆర్ధికంగా బలమైన వర్గాల్ని వీరికి లింక్ చేసి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చేసింది. దీంతో ఓటర్లు కూడా ఈ వ్యవస్ధను ఆదరించారు. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం ఆర్ధిక పరిస్ధితి అంతంత మాత్రంగా ఉన్నా వైసీపీ నేతల పరిస్దితి మాత్రం బాగానే ఉంది. దీంతో జగన్ భారీగా ఆర్దిక వనరులు వెచ్చించే వారి సాయంతో గృహసారధుల వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇది సక్సెస్ అయితే ప్రస్తుతం ఉన్న వాలంటీర్ల వ్యవస్ధ కూడా దీనికి దిగదుడుపే అంటున్నారు. కాబట్టి దీనిపై భారీ అంచనాలున్నాయి.