జగన్ ఆరోగ్యం చాలా విషమం: హుటాహుటిన తల్లి, షర్మిల, అభిమాని ఆత్మహత్యాయత్నం
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ దీక్ష చేస్తున్న వైయస్ జగన్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. దీంతో నల్లపాడు దీక్షా శిబిరం వద్ద ఉద్విగ్న, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జగన్ ఆరోగ్యం చాలా విషమంగా ఉందని విజయవాడ నుంచి వచ్చిన వైద్యుల బృందం తెలిపింది.
జగన్కు కీటోన్స్ పెరుగుదున్నట్లు వైద్యులు చెప్పారు. కీటోన్స్ 3 ప్లస్గా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. జగన్ దీక్ష 122 గంటలు దాటింది. జగన్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని తెలియడంతో హైదరాబాద్ నుంచి విజయమ్మ, బెంగళూరు నుంచి షర్మిల బయలుదేరారు.
జగన్ షుగర్ లెవెల్స్, పల్స్ రేటు మరింత పడిపోయాయని వైద్యులు తెలిపారు. బీపీ 130/90, పల్స్ రేటు 80కి పడిపోయాయన్నారు. ఉదయం నుంచి జగన్ 200 గ్రాముల బరువు తగ్గారని చెప్పారు. నిరాహార దీక్షను విరమించాలని జగన్కు కొందరు వైసిపి నేతలు సూచిస్తున్నారు. మరో రూపంలో పోరాటం చేద్దామని చెబుతున్నారు.
దీక్ష ఇలాగే కొనసాగితే పరిస్థితులు చేజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీనియర్ నెప్రాలజిస్ట్ డాక్టర్ బోడేపూడి చౌదరి నాయకత్వంలో డాక్టర్ల బృందం జగన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
దీక్షా స్థలి వద్ద ఆత్మహత్యాయత్నం
జగన్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని తెలియడంతో దీక్షా స్థలి వద్ద మరో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఓ యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు, వైసిపి కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు.
చంద్రబాబును అడ్డుకునే యత్నం
జగన్ దీక్షకు మద్దతుగా వైసిపి కార్యకర్తలు, నేతలు విశాఖలో చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
జగన్ కోసం పూజలు
జగన్ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ అనంతపురం జిల్లా గోరంట్లలోని ఏటి గంగమ్మ దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. జగన్ దీక్ష విజయవంతం కావాలని వారు ఆకాంక్షించారు. జగన్ కోసం సోదరి షర్మిల, తల్లి విజయమ్మ వస్తుండగా... సతీమణి భారతి దీక్షా స్థలి వద్దే ఉన్నారు.