సుప్రింకోర్టు తీర్పుపై... రాష్ట్రపతి,ప్రధానికి జగన్ లేఖ
గుంటూరు:ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును పునసమీక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలను కోరుతూ వైసిపి అధ్యక్షుడు జగన్ లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్టు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని వైఎస్ జగన్ ఆ లేఖలో అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్ర రాష్ట్రంలోని సుభాష్ కాశీనాథ్ మహాజన్లో తాజా తీర్పుతో ఎస్సీ, ఎస్టీలు అభద్రతా భావానికి లోనవుతారని జగన్ తన లేఖలో వివరించినట్లు తెలిసింది. సుప్రీం కోర్టు ఈ తీర్పు దళితుల పట్ల ఆత్మహత్యా సదృశ్యమని, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం యొక్క అసలు స్ఫూర్తిని ఈ తీర్పు దెబ్బతీస్తుందని వైసిపి బలంగా విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు దళితుడిగా పుట్టాలని ఎవరూ కోరుకుంటారని వ్యాఖ్యానించారని, అలాగే మరో మంత్రి ఆది నారాయణరెడ్డి దళితులు అపరిశుభ్రంగా ఉంటారని వ్యాఖ్యలు చేశారని, దళితుల పట్ల పాలకుల ఫ్యూడల్ భావజాలానికి ఇది నిదర్శనమని జగన్ తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. వీరే అలా మాట్లాడితే పాలకులే అలా మాట్లాడితే మిగిలిన వారి సంగతి ఏంటో మీరే ఆలోచించాలంటూ జగన్ ఈ లేఖలో ఊటంకించారు. భారత రాజ్యాంగం కుల రహిత సమాజాన్ని కోరుకుందని రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీలకు రాసిన తన లేఖల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.