100 రోజులుకు చేరుకున్నజగన్ పాదయాత్ర...ఇప్పటివరకు 1339కి.మీ నడక...
ప్రకాశం జిల్లా: వైఎస్ఆర్సిపి అభిమానులు గత కొన్నాళ్లుగా ఈరోజు కోసమే ఎదురుచూస్తున్నారు. కారణం ఈరోజు వారి అభిమాన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర బుధవారంతో 100 రోజులుకు చేరుకుంటుంది. నవంబర్ 6వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ పాదయాత్ర రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పూర్తయి ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది.
తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లోనే నడవాలనే ఆకాంక్షతో పాటు రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసిపి అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 2017 నవంబర్ 6 వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు కొనసాగించాలని నిర్ణయించారు. ఆ క్రమంలోనే ఇడుపుల పాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. తండ్రి వైఎస్ఆర్ తీరులోనే ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల ఆకాంక్షల నుంచే మేనిఫెస్టో రూపొందించాలనే ఆలోచనతో ఈ పాదయాత్ర చేపట్టినట్లు జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.
జగన్ 100వ రోజు పాదయాత్ర ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి మండలం ఉప్పలపాడు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి వెల్లూరి మీదుగా సంతనూతలపాడు నియోజకవర్గంలోని మర్రిచెట్ల పాలెంలోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత అక్కడి నుంచి బుదవాడ, రామ తీర్థం వరకు కొనసాగాక మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది. తిరిగి 2.45 గంటలకు వైయస్ జగన్ పాదయాత్ర పునఃప్రారంభమై చిమకుర్తి మండల కేంద్రానికి చేరుకుంటుంది. అక్కడ జగన్ ప్రజా సంకల్ప యాత్రలో 100 రోజులకు చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.
ప్రభుత్వ పధకాల అమలులో లోపాలను ప్రజలకు వివరిస్తూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అలాగే 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల అమలులో లోపాలను ప్రజలకు ఎత్తిచూపుతూ తన యాత్ర సాగిస్తున్నారు. నవరత్నాల పేరుతో తాము అధికారంలోకి వస్తే ప్రజలకు చేసే కార్యక్రమాల గురించి జగన్ తన పాదయాత్రలో వివరిస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో జగన్ పాదయాత్ర పూర్తిచేసి ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ పాదయాత్ర 100వ రోజుకు చేరుకుంది.
ప్రస్తుతం జగన్ తన ప్రజాసంకల్పయాత్రలో టిడిపి ప్రభుత్వంపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలతో ధ్వజమెత్తుతున్నారు. టిడిపి ప్రభుత్వం రాష్ట్రానికి ఏం మేలు చేసిందో చెప్పాలంటూ జగన్ బహిరంగ సభల్లో నిలదీస్తున్నారు. ఎపికి ప్రత్యేక హోదా రాకుండా చంద్రబాబే అడ్డుపడ్డారని, ఆయన స్వార్థం కోసం ప్రత్యేక ప్యాకేజీకి ఆశపడ్డారని జగన్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామంటూ జగన్ నొక్కివక్కాణిస్తున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అవినీతి, నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో జరుగుతున్న అక్రమాలు,భూ దందాలపై కూడా సమగ్ర విచారణ జరుపుతామని జగన్ స్పష్టం చేస్తున్నారు.
అలాగే ఈ పాదయాత్రలోనే జగన్ తమ పార్టీలోని నేతల మధ్య విభేదాలను తొలగించాలని, ఆ దిశలో నేతల మధ్య సయోధ్య కుదురుస్తూ పాదయాత్రను కొనసాగిస్తుండటం విశేషం. జగన్ పాదయాత్రలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీల్లో వృద్ధాప్య పెంక్షన్ ను రూ.2 వేలకు, దివ్యాంగుల పింఛన్ ను 3 వేలకు పెంచుతామనడం గమనార్హం. అలాగే వైఎస్ఆర్ రైతు బీమా పేరుతో రైతులకు ప్రత్యేక రుణాలు అందిస్తామంటూ జగన్ హామీ ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రతి రైతుకు నాలుగేళ్ల పాటు వ్యవసాయ ఖర్చుల కోసం 12 వేల 500 రూపాయలు ఇస్తామని కూడా జగన్ హామీ ఇచ్చారు. అలాగే జగన్ తన పాదయాత్రలో కొన్ని విషయాల్లో తాను చేయలేని విషయంలో చెయ్యలేనని స్పష్టంగా చెబుతుండటం గమానార్హం. ఎస్సీ వర్గీకరణకు హామీ ఇవ్వాల్సిందిగా ఎమ్మార్పిఎస్ కార్యకర్తలు నిలదీసిన క్రమంలో జగన్ ఈ విషయం కేంద్రం పరిధిలోనిదని తానే చెయ్యలేనని నిర్మొహమాటంగా స్పష్టం చేయడం విశేషమే.
జగన్ పాదయాత్ర బుధవారంతో వంద రోజులకు చేరుకునే నాటికి మరోవైపు ఆయన ప్రజా సంకల్పయాత్ర 13 వందల కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. జగన్ తన పాదయాత్ర కొనసాగిస్తున్న క్రమంలో ప్రతి వంద కిలోమీటర్ల దూరం పూర్తవగానే అందుకు గుర్తుగా ఆ ప్రదేశంలో ఒక్కో మొక్కను నాటుతూ ముందుకు సాగుతుండటం విశేషం. ఇలా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల దూరం 180 రోజుల పాటు కొనసాగి ఇచ్చాపురం చేరుకోవడంతో ముగియనుంది.