టీడీపీకి వైసీపీ ఎమ్మెల్యే ఫ్రశంస: యాత్రలో అత్యుత్సాహం, జగన్ చేయి పట్టుకొని పోలీస్ 'అల్లుడు'
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే ముస్తఫా మంగళవారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో అధికార పార్టీకి కితాబిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి మంచిదేనని వ్యాఖ్యానించారు. జన్మభూమి - మా ఊరు గుంటూరు తూర్పులోని మంగళ్దాస్ నగర్, అహ్మద్ నగర్లో జరిగింది.
Recommended Video
'బాలకృష్ణకు కూడా బాబు టిక్కెట్ ఇవ్వరు, అందుకే జగన్కు నేతలు కరువు'
ఈ కార్యక్రమంలో ముస్తఫా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది ఏదో జన్మభూమి అన్నారు. వృద్ధులు, వితంతు, దివ్యాంగులకు పింఛన్లు, రేషన్ కార్డులు అందజేశారన్నారు. ఇంకా రానివారు ఎందరో ఉన్నారని చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు.
ప్రజల విన్నపాలకు వేదికగా జన్మభూమి
స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులకు ప్రజలు విన్నవించుకోవటానికి జన్మభూమి వేదికగా మారింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు నరసరావుపేటలోని స్టేడియం, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతోపాటు జిల్లా కలెక్టరు కోన శశిధర్ సాతులూరు, సొలస, గొట్టిపాడు, మరో మంత్రి నక్కా ఆనందబాబు అమృతలూరు మండలం మోపర్రు, కూచిపూడిల్లో జరిగిన గ్రామ సభల్లో పాల్గొని అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ముస్తఫా మినహా వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరు
పార్లమెంటు సమావేశాలు ఉండటంతో ఎంపీలు హాజరు కాలేదు. జిల్లా టీడీపీ అధ్యక్షులు, వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు వినుకొండ పురపాలక సంఘ పరిధిలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కూడా పాల్గొన్నారు. ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు జన్మభూమికి దూరంగా ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ ఇంచార్జులు హాజరయ్యారు.
700 కిలోమీటర్ల యాత్ర, మొక్క నాటిన జగన్
కాగా, వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. వైసీపీకి అవకాశం ఇవ్వాలని, అధికారంలోకి రాగానే నవరత్నాలను అమలు చేసి పేదల గుండెల్లో వెలుగులు నింపుతానని జగన్ కోరారు. మంగళవారం నాటికి 700 కి.మీ. పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. ఇందుకు గుర్తుగా వాల్మీకిపురంలో మొక్క నాటి పాదయాత్ర కొనసాగించారు.
జగన్ పాదయాత్రలో పోలీసుల అత్యుత్సాహం
పూలవాండ్లపల్లె నుంచి వాల్మీకిపురం మధ్య సాగిన జగన్ పాదయాత్రలో విధులు నిర్వహించేందుకు వచ్చిన రొంపిచెర్ల ఎస్సై నాగార్జున రెడ్డి కొంతసేపు జగన్ చేయి పట్టుకుని నడవడం చర్చనీయాంశమైంది. దీన్ని చూసి పార్టీ నాయకులు సైతం అవాక్కయ్యారు. అనంతపురం జిల్లాకు చెందిన నాగార్జున రెడ్డి కడప జిల్లాలో వివాహం చేసుకున్నారు. గతంలో చౌడేపల్లె ఎస్సైగా పనిచేశారు. వారం కిందటే చిత్తూరు నుంచి వచ్చి రొంపిచెర్లలో బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఉద్యోగి ఒక పార్టీ అధినేత వెంట సన్నిహితంగా నడవటం చర్చకు దారి తీసింది. పోలీసు అధికారి అత్యత్సాహం ప్రదర్శించారని అంటున్నారు. డివిజన్ స్థాయి అధికారి జగన్తో రహస్య చర్చలు జరిపారని అంటున్నారు.