పింఛను కూడా ఇప్పించ లేరు.. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా?: జగన్
పింఛను కూడా ఇప్పించలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనకు అవసరమా? అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఏపీ సీఎం చంద్రబాబును విమర్శించారు.
Recommended Video
కడప: పింఛను కూడా ఇప్పించలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనకు అవసరమా? అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఏపీ సీఎం చంద్రబాబును విమర్శించారు. పాదయాత్ర రెండో రోజు మంగళవారం కడప జిల్లా వేంపల్లెలోని ఓ ప్రైవేటు కల్యాణమండపంలో జగన్ రచ్చబండ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓ వృద్ధురాలు.. తన భర్త చనిపోయి ఆర్నెల్లు గడిచినా తనకింకా పింఛను అందలేదని జగన్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన.. 'తహశీల్దార్కు చెప్పినా పని జరగదని, కోర్టును ఆశ్రయించైనా సరే ఈమెకు పింఛను వచ్చేలా చేస్తా..'నని హామీ ఇచ్చారు.
మహిళల అనూహ్య స్పందన...
రెండో రోజు పాదయాత్రను జగన్ ఉదయం 9 గంటలకు ప్రారంభించారు. యాత్ర వేంపల్లె పట్టణం గుండా సాగింది. టౌన్ శివార్ల నుంచి మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు. మంగళహారతులు ఇస్తూ స్వాగతం పలికారు. వృద్ధులు, మహిళలు ఆయన దగ్గరకు వెళ్లి వారివారి సమస్యలను చెప్పుకున్నారు. రచ్చబండను గంట ఆలస్యంగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నిర్వహించారు. తొలి రోజు 8.9 కిలోమీటర్లు పాదయాత్ర చేయగా.. రెండోరోజు 12.6 కిలోమీటర్లు సాగింది.
చంద్రబాబు మనకు అవసరమా?
మంగళవారం నాటి రచ్చబండ కార్యక్రమంలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ వృద్ధులకు కనీసం పింఛన్ కూడా ఇవ్వలేని ముఖ్యమంత్రి చంద్రబాబు మనకు అవసరమా? అని కార్యక్రమానికి హాజరైన ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. తనకు ఒకటిన్నరేళ్ల సమయమివ్వాలని, ఆ తర్వాత తాను గద్దెనెక్కగానే ప్రతి మండలంలో ఒక వృద్ధాశ్రమం నిర్మిస్తామని, డాక్టర్, నర్సును నియమిస్తామని చెప్పారు.
పింఛన్ పెరిగిందా.. కారణం నేనే...
చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం నెలనెలా ఇస్తున్న రూ.1000 పింఛనును రూ.2000 చేస్తామని చెప్పారని వైస్ జగన్ చెప్పారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు రూ.2 వేలిచ్చే అవకాశముందని, అయితే ఇలా జరగడానికి కారణం తానే అన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. అంతేకాదు, తాను అధికారంలోకి వచ్చాక అవసరమైతే పింఛను మరింత పెంచి రూ.3 వేలు ఇస్తామని కూడా జగన్ ప్రకటించారు.
అన్ని సమస్యలూ తీరుస్తా...
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.42 లక్షల ఉద్యోగాలను తాను అధికారంలోకి రాగానే భర్తీ చేస్తానని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తెలిపారు. ‘మీ దయతో, దేవుడి ఆశీస్సులతో ఏడాదిలో మన ప్రభుత్వం ఏర్పాటైతే రాష్ట్ర ప్రజానీకానికి ఏయే సమస్యలున్నాయో వాటన్నిటిని తీరుస్తాం. మీ సలహాలు సూచనలతో నవరత్నాల్లో కూడా మార్పులు, చేర్పులు చేస్తాం..' అని చెప్పారు. అంతేకాదు, అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచితంగా విద్యుత్ అందిస్తామన్నారు. ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు.
చెబుతారు అంతే.. చేయరు
ఏటా డీఎస్సీ ద్వారా టీచర్లను భర్తీచేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన చంద్రబాబు మాట మార్చారని ఆరోపించారు. చదువుకునే ప్రతి ఒక్కరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలుచేస్తామని, వారి భోజనాలకు అదనంగా రూ.20 వేల చొప్పున చెల్లిస్తామన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు... 12 లక్షల ఎకరాల భూ పంపిణీ చేశారని.. తాను సీఎం కాగానే 13 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తానని తెలిపారు. పాదయాత్రలో జగన్ వెంట ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైఎస్ అవినాశ్రెడ్డి, ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, గడికోట శ్రీకాంత్రెడ్డి, రాచమల్లు ప్రసాదరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి, మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.