జగన్ చెప్పిన పెద్దపులి కథ: చంద్రబాబును ఏకేశారు...
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం చిత్తూరు జిల్లా కలికిరి ప్రజా సంకల్ప యాత్రలో ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టుల్లో వచ్చే కమీషన్లపైనే చంద్రబాబు శ్రద్ధ పెడుతున్నారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసే ఆలోచన చంద్రబాబుకు లేదని, రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను ఆయన మోసం చేశారని విమర్శించారు.
చంద్రబాబుకు అనుభవం ఉంది కదా అని ప్రజలు ఆయనకు ఓటేసి గెలిపించారని, అధికారంలోకి వచ్చిన ఆయన, ప్రతిఒక్కరినీ మోసగించారని జగన్ విమర్శించారు. కులాల పరంగా చంద్రబాబు మ్యానిఫెస్టో తెచ్చారని అన్నారు. చంద్రబాబును విమర్శించే సందర్భంగా జగన్ ఓ పులికథను ప్రస్తావించారు.
జగన్ చెప్పిన పెద్దపులి కథ...
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలోని కలికిరి వద్ద నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ‘పెద్ద పులి' కథ చెప్పారు. ‘అనగనగా ఓ పెద్ద పులి. అది అడవిలో ఉండేది. అడవిలోని జంతువులను అది మోసం చేసేది. అబద్ధాలు చెప్పేది.. చాలా క్రూరంగా ప్రవర్తించేది..'
తన స్వార్థం కోసమే...
‘ఆ పెద్దపులి ప్రజలను, జంతువులను విపరీతంగా తినేది. ఎవరినీ లక్ష్య పెట్టకుండా తన స్వార్ధం కోసం, కడుపు నిండటం కోసం ఎవరినైనా తినేసేది. ఆ పులి చేస్తున్న అన్యాయాలను, మోసాలను, హత్యలను తట్టుకోలేక అక్కడున్న ప్రజలు దాన్ని అడవిలో నుంచి తరిమేశారు..' అని చెప్పారు.
తొమ్మిదేళ్ల తరువాత మళ్లీ వచ్చి...
‘తొమ్మిదేళ్ల పాటు ఆ పులిని తరిమేశారు. ఇంచుమించి చంద్రబాబుని ప్రజలు ఏ విధంగా తొమ్మిదేళ్ల పాటు పదవి నుంచి తప్పించారో అలా. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఆ పులి అడవిలోకి వచ్చింది. అలా అడవిలోకి వచ్చిన పులిని ప్రజలు నమ్మలేదు. పులి వయసు కూడా పెరిగిపోయింది. ఇంచుమించుగా 70 ఏళ్లు వచ్చాయి..'
మారిపోయానంటూ మాయమాటలు...
‘ఇక వేటాడే సామర్ధ్యం లేదని ఆ పులికి అర్థమైంది. అలా అర్థమైన మరుక్షణమే ఓ మనిషిని చంపేసి, అతని వద్ద ఉన్న బంగారు కంకణాన్ని తీసుకుంది. దాంతో ఊరి చివర ఉన్న చెరువు కట్టకు ఓ వైపు కూర్చుంది. దారిన పోయే వారితో అయ్యా నేను మారిపోయాను..' అని మాయమాటలు చెప్పింది..'
ఈ వయసులో నాకెందుకంటూ...
‘నన్ను ఆదరించండి. ఇదిగో నా వద్ద బంగారు కడియం ఉంది. దీన్ని ముసలి వయసులో నేనేం చేసుకోవాలి. మీరే దీన్ని తీసుకోండి అని అనడం మొదలుపెట్టిందట. మొదట్లో ప్రజలు ఎవరూ పులిని నమ్మలేదు. కొంతకాలానికి పులిని చూసి చూసి.. దాని చేతిలో ఉన్న బంగారు కడియాన్ని చూసి ప్రజలకు ఆశ కలిగింది..'
మళ్లీ అందర్నీ తినేస్తోంది...
‘మారిపోయిందట కదా దగ్గరికి పోతే బంగారు కడియం ఇస్తుందేమో అని చెప్పి వెళ్లినవారందరినీ పులి తినేయడం మొదలుపెట్టింది. ఇంచుమించుగా ఇదే రీతిలోనే మన చంద్రబాబు నాయుడు కూడా. నేను మారాను అని ప్రజలతో అన్నారు. ప్రజలంతా ఈయన నిజంగానే మారాడేమో అనుకున్నారు..'
ఎవరినీ వదలకుండా తినేశాడు...
‘అనుభవం ఉంది కదా అని ఓట్లేసి గెలిపిస్తే... ఆ తర్వాత బాబు ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. రైతులు మొదలు అక్కచెల్లెమ్మలు, పిల్లలను కూడా వదల్లేదు. కులాల పరంగా మ్యానిఫెస్టో తెచ్చాడు. ప్రతి కులాన్ని మోసం చేసేందుకు ఒక్కొక్క పేజీ కేటాయించాడు. ఎవ్వరినీ వదలిపెట్టకుండా పూర్తిగా అన్యాయంగా తినేశాడు.' అంటూ కథను ముగించారు వైఎస్ జగన్.