జగన్ సంకల్పయాత్ర: బండి ఎక్కి చర్నాకోల చేబూని...
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర శనివారంనాడు కొనసాగింది. శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరైన ఆయన తన యాత్రను శనివారంనాడు కొనసాగించారు.
Recommended Video
కర్నూలు : వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర శనివారంనాడు కొనసాగింది. శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరైన ఆయన తన యాత్రను శనివారంనాడు కొనసాగించారు. పత్తికొండ నియోజకవర్గం చెరుకులపాడు చేరుకున్న ఆయనకు ప్రజలు స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలనలో తాము పడుతున్న ఇబ్బందులను ప్రజలు ఆయనకు వివరించారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, అధైర్యపడొద్దని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ పార్టీ జెండా ఆవిష్కరించారు.
ఎడ్ల బండి ఎక్కి చెర్నాకోలా చేతబట్టారు. ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన పార్టీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి సమాధిని వైఎస్ జగన్ సందర్శించి, నివాళులు అర్పించారు.
దివ్యాంగుడు కలిశాడు..
పాదయాత్రలో వైఎస్ జగన్ను జైపాల్ రెడ్డి అనే దివ్యాంగుడు కలిశాడు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల పెన్షన్లను రూ.1500 నుంచి రూ.3000కి పెంచాలని కోరారు. దాంతో పాటు రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న బియ్యాన్ని 35 కెజీలకుక పెంచాలని కోరాడు. దానికి జగన్ సానుకూలంగా స్పందించారు.
సమస్యలు విన్నవించుకున్న మహిళలు
అంతకు ముందు వెల్దుర్తిలో వైఎస్ జగన్ను మహిళలు కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సహకారం, బ్యాంకు రుణాలు గురించి మహిళలను జగన్ అడిగి తెలుసుకున్నారు. రుణాలు అందుతున్నాయా లేదా అని ప్రశ్నించారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వచ్చిందా లేదా అని అడిగారు. దీనికి రుణాలు అందలేదని, బంగారం బ్యాంకులోనే ఉందని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తాము అమలు చేయబోయే పథకాల గురించి జగన్ మహిళలకు హామీ ఇచ్చారు.
జగన్ను కలిసిన ముస్లిం సోదరులు
తమను టీడీపీ ప్రభుత్వం పూర్తిగా దగా చేసిందని మైనార్టీ సోదరులు జగన్కు విన్నవించుకున్నారు. రిజర్వేషన్తొ పాటు మసీదుల్లో పనిచేసే వారికి ఇచ్చే జీతాల విషయంలో కూడా మోసం చేశారని వారు తెలిపారు. దీనిపై స్పందించిన ప్రతిపక్షనేత తమ పార్టీ అధికారంలోకి రాగానే అని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా జగన్ను కలిశారు. తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలా పాదయాత్ర....
చెరుకులపాడు, పుట్లూరు, తొగరచేడు క్రాస్ మీదగా మధ్యాహ్నానికి వైఎస్ జగన్ కృష్ణగిరి చేరుకుంటారు. అక్కడే భోజన విరామం తీసుకుంటారు. తిరిగి యాత్రను కృష్ణగిరి మీదుగా రామకృష్ణాపురం వరకూ కొనసాగిస్తారు. పాదయాత్రలో భాగంగా సాయంత్రం కృష్ణగిరి గ్రామస్తులతో ....వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం రామకృష్ణాపురం వరకు నడక సాగించి...రాత్రికి అక్కడే బస చేస్తారు.